ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్తతో సంబంధం పెట్టుకున్న అల్లుడు.. మేనమామ దారుణంగా హత్య

Crime |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 09:15 PM

సమాజంలో రోజురోజుకూ పెడధోరణులు పెరిగిపోతున్నాయి. కొంతమంది యువతలో విపరీత వైఖరులు వెలుగుచూస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకునే ఘటనలు, మానవత్వానికి మచ్చ తెచ్చే పరిణామాలు నిత్యం ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలోకి తెచ్చిన సెల్లు మహిమో.. కలియుగపు ప్రభావమో తెలియదు కానీ మానవ సంబంధాలను కూడా కలుషితం చేసే ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది.


మేనమామ, మేనత్త అంటే.. తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం ఇచ్చే వ్యక్తులు. కొన్ని ఇళ్లల్లో తల్లిదండ్రుల కంటే మేనమామ, మేనత్తల వద్దనే పిల్లలకు కాస్త చనువు ఎక్కువ ఉంటుంది. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించాడు. మేనత్తతో సంబంధం పెట్టుకుని.. మేనమామను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులు. వారికో మేనల్లుడు.. ఈ మేనల్లుడు అందరి ఇళ్లకు వెళ్లిన విధంగానే మేనమామ ఇంటికి కూడా వెళ్తుండేవాడు. అత్త, మామతో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఎలా పుట్టిందో దుర్బుద్ధి పుట్టింది. అత్తపైనే కన్నేశాడు.


హార్మోన్ల ప్రభావంతో ఉబికి వచ్చిన యవ్వనపు కోరికతోనో.. లేదా అరచేతిలోని సెల్ ఫోన్ రేకెత్తించిన కామ వాంఛతోనో.. అత్త మీద మనోడి కన్ను పడింది. పోనీ ఆమైనా బాధ్యతగా వ్యవహరించిందా అంటే అదీ లేదు. దీంతో మేన మామకు తెలియకుండా, అత్తా అల్లుడి వ్యవహారం మొదలైంది. మామ ఇంటికి అల్లుడి రాకపోకలు పెరిగాయి. క్రమంగా ఈ విషయం మేనమామకి తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని ఇద్దరినీ హెచ్చరించాడు. అయితే ఆ అల్లుడు వినిపించుకోలేదు. మామను అంతమొందిస్తే ఇక మనకు అడ్డేముందని అనుకున్నాడు. మేనమామను దారుణంగా హత్యచేసి ఊరి సమీపంలోని చెరువు వద్ద పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు.


అయితే రోజులు గడుస్తున్నా యువకుడి మేనమామ కనిపించకపోవటంతో వారి బంధువులలో అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కనిపించకుండా పోయిన వ్యక్తి చివరిసారిగా అల్లుడితో కలిసి కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ తంతు జరుగుతున్న సమయంలోనే అల్లుడు పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


మరోవైపు పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితుడి మీద క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిసింది. అత్తామామల వద్ద ఉంటే సక్రమంగా ఉంటాడనే కారణంతోనే అతని తల్లిదండ్రులు.. మేనమామ, మేనత్తల వద్దకు రెండేళ్ల క్రితం పంపించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అత్తతో సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. మరోవైపు మేనమామను చంపేసిన అనంతరం అత్త, అత్త కొడుకుతో కలిసి శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa