అంతరిక్ష పరిశోధనలలో భారత్కు నవ శకానికి శ్రీకారం చుట్టిన భారత అంతరిక్ష వీరుడు శుభాన్షు శుక్లా.. తన చారిత్రాత్మక యాక్సియమ్-4 మిషన్ను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమ్మీదకు వచ్చిన తర్వాత తొలిసారి భారత దేశానికి తిరిగి రానున్నారు. ఇండియాకు వచ్చిన మరుసటి రోజే ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 'ఇండియాస్ ట్వంటీఫస్ట్ సెంచరీ స్పేస్ హీరో'గా పేరు గాంచిన శుభాన్షు శుక్లా స్వదేశానికి వస్తున్నాడని తెలియడంతో.. దేశవ్యాప్తంగా ఉత్సాహం నెలకొంది. భారత గగన్యాన్ కార్యక్రమానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానితో భేటీలో శుభాన్షు శుక్లా అంతరిక్షంలో తన అనుభవాలను, పరిశోధనల విషయాలను వివరించనున్నట్లు సమాచారం.
అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన శుభాన్షు శుక్లా స్వదేశానికి వచ్చి తన అనుభవాలను దేశ ప్రజలతో పంచుకోనున్నారు. ఆగస్టు 18వ తేదీ సోమవారం రోజు ప్రధాని మోదీని కలిసిన తర్వాత.. ఆగస్టు 23వ తేదీన జరగబోయే జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలలో కూడా పాల్గొననున్నారు. ఈ వేడుకలలో ఆయన ప్రసంగం దేశంలోని యువతలో అంతరిక్ష రంగంపై మరింత ఆసక్తిని పెంచుతుందని ఆశిస్తున్నారు. శుక్లాతో పాటు మరో వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఇదే తరహా శిక్షణ పొందారు. భవిష్యత్తులో గగన్యాన్ మిషన్లో వీరిద్దరూ కీలక పాత్ర పోషించనున్నారు.
ముఖ్యంగా శుభాన్షు శుక్లా 18 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. ఈ సమయంలో ఆయన అంతరిక్షంలో వ్యోమగాముల ఆరోగ్యం, సూక్ష్మ గురుత్వాకర్షణకు శరీరం ఎలా అనుగుణంగా మారుతుంది, అలాగే వ్యోమనౌక నిర్వహణ, మిషన్ అనంతర పునరావాసం వంటి అంశాలపై అనేక ప్రయోగాలు నిర్వహించారు. ఈ ప్రయోగాల నుంచి లభించిన సమాచారం గగన్యాన్ మిషన్కు చాలా కీలకం కాబోతున్నాయి. ప్రధానమంత్రి మోదీతో జరిగే సమావేశంలో శుక్లా ఈ వివరాలను పంచుకోనున్నారు.
అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. మరోవైపు భారత్కు చెందిన సొంత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడానికి ఇస్రో సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో శుక్లా అనుభవాలు శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడతాయి. ఆయన తన శిక్షణ, అంతరిక్ష కేంద్రంలో గడిపిన సమయాన్ని ఒక హ్యాండ్బుక్గా రూపొందిస్తున్నారు. ఇది భవిష్యత్తులో గగన్యాన్లో పాల్గొనే వ్యోమగాములకు ఒక మార్గదర్శిగా నిలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa