ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోంది. కొన్నేళ్లుగా ఏపీలో స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారని.. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా భూ లావాదేవీలు పెరిగాయని చెప్తున్నారు. అలాగే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పెరగటం కూడా ఏపీలో రియల్ ఎస్టేట్ పుంజుకుంటోందనడానికి సంకేతాలని వెల్లడిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏపీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 46 శాతం పెరిగిందని లెక్కలు చెప్తున్నాయి. ఇక వృద్ధి రేటు కూడా 39 శాతంగా ఉందని.. రియల్ ఎస్టేట్ రంగం రికవరీ చెందిందనడానికి ఇదో సంకేతమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
రాజధాని అమరావతిలో సుమారుగా 50 వేల కోట్ల విలువైన పనులు మొదలు కావటంతో అమరావతి నిర్మాణంపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగిందని తెలుస్తోంది. దీంతో అప్పటి వరకూ వేచి చూసే ధోరణిలో ఉన్న పెట్టుబడిదారులు.. రాజధానిపై ఆసక్తి చూపటం మొదలుపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం డేటాను విశ్లేషిస్తే..కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలలో భూలావాదేవీలు అధికంగా జరిగాయి. అలాగే ఆదాయం కూడా ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా సమకూరింది. దీంతో ఏపీలో రియల్ ఎస్టేట్ రంగాన్ని అమరావతి నడిపిస్తోందనే విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో అమరావతితో పాటుగా.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
మరోవైపు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అమరావతిలో భూముల ధరలు అమాంతం పెరిగాయని రియల్టర్లు చెప్తున్నారు. రేట్లు పెరగటంతో లావాదేవీలు తగ్గిపోయాయని వివరిస్తున్నారు. అయితే అమరావతిలో భూముల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. డెవలపర్లు, ఇన్వెస్టర్లు.. అందుబాటులో రేట్లు ఉండి, భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండే ప్రాంతాలను అన్వేషిస్తున్నారని చెప్తున్నారు. అమరావతి మాత్రమే కాకుండా గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు వంటి ప్రాంతాలలోనూ భూలావాదేవీలు పెరిగినట్లు చెప్తున్నారు.
అలాగే ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు ప్రకటించిన ప్రాంతాల్లోనూ భూములకు డిమాండ్ పెరిగిందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. అలాంటి గ్రామీణ ప్రాంతాలు అయినప్పటికీ కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారని వెల్లడిస్తున్నాయి. మరోవైపు లేఅవుట్లు, భవనాలకు సంబంధించిన అనుమతుల విషయంలో ప్రభుత్వం నిబంధనలను సడలించడం కూడా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తోందని కొంతమంది రియల్టర్లు చెప్తున్నారు. ఇక నాలా కన్వర్షన్ ఫీజులను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa