ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌పోర్టుల తరహాలో రైల్వే స్టేషన్లలో లగేజీ తూకం

national |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 09:34 PM

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే లు దేశంలో రోజూ లక్షలాది మందిని గమ్యస్థానానికి చేర్చుతున్నాయి. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడానికి భారతీయ రైల్వే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టుల్లో మాదిరిగా రైల్వే స్టేషన్లలోనూ ఇకపై లగేజీని తూకం వేయనున్నారు. ప్రయాణికులు తమ పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే విమానాల మాదిరిగానే అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ విధానం నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ ప్రయాగ్‌రాజ్ డివిజన్ పరిధిలోని ముఖ్యమైన స్టేషన్లలో ప్రారంభించనున్నారు. ప్రయాగ్‌ రాజ్ జంక్షన్, ప్రయాగ్‌రాజ్ చెయోకి, సుబేదార్‌గంజ్, కాన్పూర్ సెంట్రల్, మీర్జాపూర్, తుండ్లా, అలీగఢ్ జంక్షన్, గోవింద్‌పురి, ఎటావా స్టేషన్లలో ప్రయాణికుల లగేజీ తూకం విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తర్వలోనే ఎలక్ట్రానిక్ లగేజ్ మెషీన్‌లను ఏర్పాటుచేయనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్లాట్‌ఫామ్‌పైకి రావడానికి ముందే ప్రయాణికుల బ్యాగుల బరువును తూకం వేసి.. పరిమితికి మించి ఉంటే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు.


బరువు మాత్రమే కాదు.. బ్యాగు పరిమాణం కూడా!


బరువు మాత్రమే కాకుండా బ్యాగుల పరిమాణాన్ని కూడా తనిఖీ చేస్తామని రైల్వే స్పష్టం చేసింది. బ్యాగు చాలా పెద్దదిగా ఉండి, కోచ్ లోపల అదనపు స్థలాన్ని ఆక్రమించినట్లయితే, ప్రయాణీకుడు జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. బరువు పరిమితికి లోబడి ఉన్నప్పటికీ బ్యాగు పరిణామం ఎక్కువ ఉంటే ఇబ్బంది తప్పదు. వాస్తవానికి రైళ్లలో ప్రయాణించే వారికి లగేజీ పరిమితులు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ పకడ్బంధీగా అమలు చేయడం లేదు.


లగేజీ పరిమితి


ఫస్ట్‌ క్లాస్ ఏసీ: 70 కిలోలు వరకూ (ఒక్కొక్కరికి),


సెకెండ్ ఏసీ: 50 కిలోల వరకూ (ఒక్కొక్కరికి)


థర్డ్ ఏసీ: 40 కిలోల వరకూ (ఒక్కొక్కరికి)


స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకూ (ఒక్కొక్కరికి)


జనరల్ లేదా సెకెండర్ సిట్టింగ్: 35 కిలోలు (ఒక్కొక్కరికి)


లగేజీ బుకింగ్


అయితే, ప్రయాణీకులు బుకింగ్ లేకుండా 10 కిలోల వరకు తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. కానీ అంతకంటే ఎక్కువగా ఉంటే, వారు దానిని స్టేషన్ కౌంటర్‌లో ‘లగేజీ’గా బుక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రయాణికుడు బుకింగ్ పరిమితి కంటే లగేజీ ఎక్కువ తీసుకున్నట్టు గుర్తిస్తే జరిమానా వసూలు చేస్తారు. ఇది లగేజీ ఛార్జీల కంటే ఒకటిన్నర రెట్లు అధనంగా ఉంటుంది. కాబట్టి బుకింగ్ చేసుకోకుండా పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే జేబుకు చిల్లుపడటం ఖాయం.


ఈ రూల్స్ ఎందుకు?


రైల్వే అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణీకుల భద్రత, సౌకర్యాన్ని నిర్ధారించడానికి ఈ విధానం రూపొందించారు. చాలా మంది అధిక సామాను తీసుకురాడంతో ఇతరులకు అసౌకర్యం కలుగుతుంది. భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. రైల్వేలు లగేజీ నియంత్రణను అమలు చేయడం ద్వారా రద్దీని ముఖ్యంగా పండుగలు, వేసవి సెలవుల్లో మెరుగ్గా నిర్వహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa