ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కట్నం హత్య కేసులో ఐదేళ్ల కుమారుడి భయంకర సాక్ష్యం

national |  Suryaa Desk  | Published : Sun, Aug 24, 2025, 05:51 PM

అప్పటికే వారికి పెళ్లి అయింది. ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లూ హాయిగా సాగిన వీరి కాపురంలో.. గొడవలు మొదలయ్యాయి. ముఖ్యంగా భర్త, అత్తమామలు పెళ్లైన ఇన్నేళ్లకు అదనపు కట్నం కావాలని వేధించడం ప్రారంభించారు. రోజు కొట్టడం, నరకం చూపించడం చేశారు. కానీ కన్నవాళ్ల వద్ద అన్ని డబ్బులు లేవని, తాను అదనపు కట్నం తేలేనని మహిళ చెప్పగా.. తీవ్ర కోపోద్రిక్తులైన అత్తింటి వారు ఆమెను చంపేశారు. ముఖ్యంగా ఐదేళ్ల కుమారుడి కళ్ల ముందే లైటర్‌తో నిప్పంటించి భార్యను చంపేశాడు భర్త. ఈ దారుణాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు.. పోలీసుల ముందు అసలు విషయం చెప్పాడు. దీంతో భర్త, అత్త, మామలను అరెస్ట్ చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ దారుణమైన ఘటన గ్రేటర్ నోయిడాలోని కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో జరిగింది. మధ్య వయస్కురాలైన నిఖీ అనే మహిళను ఆమె భర్త, అత్తమామలు రూ.36 లక్షల కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు రోజురోజుకు ఎక్కువయ్యాయి. అయితే ఎప్పటిలాగే గురువారం రోజు రాత్రి కూడా కట్నం విషయంలో భార్యతో గొడవ పడ్డాడా భర్త. అతడి తల్లిదండ్రులు కూడా కొడుక్కు వంతపాడారు. దీంతో మహిళ గొడవకు దిగగా.. సమస్య మరింత పెద్దది అయింది. ముఖ్యంగా నిఖీని ఆమె భర్త, అత్తమామలు కలిసి తీవ్రంగా కొట్టారు. ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చి, ఆపై ఆమె మీద పెట్రోల్ పోశారు.


 తమ ఐదేళ్ల కుమారుడు చూస్తున్నాడన్న భయం, బాధ కూడా లేకుండా ఆ భర్త లైటర్‌తో భార్యకు నిప్పంటించాడు. నిఖీ తీవ్రమైన గాయాలతో హాహాకారాలు చేస్తూ కేకలు వేయగా.. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసు బృందం అక్కడికి చేరుకునేలోపే ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.ఈక్రమంలోనే పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా.. నిఖీయే ఆత్మహత్య చేసుకుందని భర్త, అత్తమామలు చెప్పారు. కానీ ఈ దారుణమైన ఘటనను కళ్లారా చూసిన ఐదేళ్ల బాలుడు మాత్రం పోలీసులకు అంతాచెప్పాడు. మా అమ్మపై ఏదో పోసి, చెంప దెబ్బ కొట్టి.. ఆ తర్వాత నాన్నే లైటర్‌తో ప్పంటించాడని పేర్కొన్నాడు. అమాయకంగా చిన్నారి చెబుతున్న ఈ దారుణాన్ని విన్న బంధువులు, స్థానికులంతా కంటతడి పెట్టారు.


నిఖీ అక్క కాంచన్ కూడా అదే ఇంట్లోకి వివాహం చేసుకుని వచ్చింది. కట్నం కోసం తనను, తన చెల్లెలు నిఖీని గత కొన్నాళ్లుగా అత్తమామలు, భర్త కొడుతూ.. వేధిస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ ఘటన జరిగినప్పుడు ఆమె కూడా ఇంట్లోనే ఉంది. ఈ దారుణాన్ని చూసిన ఆమె తన ఫోన్‌లో ఈ సంఘటనను రికార్డు చేసింది. అదే ఇప్పుడు పోలీసులకు బలమైన ఆధారంగా మారింది. కాంచన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ప్రధాన నిందితుడు నిఖీ భర్త విపిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa