ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో భారతీయ టూరిస్ట్‌ల బస్సుకు ప్రమాదం.. ఐదుగురు మృతి

Crime |  Suryaa Desk  | Published : Sun, Aug 24, 2025, 05:50 PM

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రర్యాటకులతో వెళ్తోన్న బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. న్యూయార్క్ సమీపంలోని బఫెలో వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఓ భారతీయుడు సహా ఐదుగురు మృతిచెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. నయాగరా జలపాతం సందర్శన అనంతరం 54 మందితో కూడి టూర్ బస్సు న్యూయార్క్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో బిహార్‌కు చెందిన శంకర్ కుమార్ ఝా (65), న్యూజెర్సీకి చెందిన పింకి ఛంగ్రానీ, చైనా, ఫిలిప్పీన్స్ పౌరులు షై హంగ్జూ (22), జాంగ్ షైలన్ (55), జియాన్ మింగ్లీ (55)గా గుర్తించారు. వీరంతా న్యూజెర్సీ రాష్ట్రంలో ఉంటున్నారని అధికారులు తెలిపారు.


ఈ దుర్ఘటన స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 12.22 గంటలకు బఫెలో సమీపంలోని పెబ్రోక్ ఇంటర్‌స్టేట్ 90 వద్ద జరిగినట్టు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. నయాగరా జలపాతం చూసేందుకు పర్యాటకులు సహా బస్సు కంపెనీ ఉద్యోగులు మొత్తం 54 మంది వెళ్లినట్టు పేర్కొన్నారు. నయాగరా జలపాతం సందర్శన అనంతరం న్యూయార్క్‌కు వస్తుండగా ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. ప్రయాణికుల్లో ఎక్కువ శాతం భారతీయులు, చైనీయులు, ఫిలిప్పీన్స్ పౌరులే అధికంగా ఉన్నట్టు న్యూయార్క్ స్టేట్ పోలీస్ ట్రూపర్ జేమ్స్ ఓ కలాఘన్ వెల్లడించారు.


బస్సు తూర్పువైపు వెళుతుండగా వాహనం నియంత్రణ కోల్పోయి రహదారి పక్కనే ఉన్న గుంతలో పడిందని ఆయన అన్నారు. ఈ ప్రమాదం కారణంగా కొద్ది గంటల పాటు రహదారిని మూసివేశారు. సాయంత్రం తర్వాత తూర్పువైపు ఉన్న లేన్‌లను రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తిరిగి తెరిచారు, పశ్చిమ వైపు ఉన్న లేన్‌లను సాయంత్రం 5 గంటల తర్వాత తిరిగి తెరిచినట్టు ది బఫెలో న్యూస్ నివేదించింది.


బోల్తా పడిన వెంటనే బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమై అందులో నుంచి చాలా మంది ప్రయాణికులు రోడ్డుపై తూళిపడ్డారని న్యూయార్క్ రాష్ట్ర పోలీసు ట్రూప్ టి కమాండర్ మేజర్ ఆండ్రీ రే తెలిపారు. ఐదుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మరణించారని, చాలామంది ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. బస్సులో ఏడాది నుంచి 74 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు ఉన్నారని పేర్కొన్నారు. ప్రమాదంలో చిన్నారి ఒకరు చనిపోయినట్టు తొలుత ప్రచారం జరిగినా.. తర్వాత అదంతా ఫేక్ అని తేలింది. ప్రమాదానికి కారణాలు సాంకేతిక వైఫల్యం, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చారని బఫెలో న్యూస్ నివేదించింది. బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ గాయాలైనట్టు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa