ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డబ్బుల్లేకుండానే దేశ యాత్ర.. 20 ఏళ్ల యువకుడి వినూత్న ప్రయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 06:13 PM

ధనం మూలం ఇదం జగత్.. అనే మాట ఎప్పుడైనా విన్నారా.. పోనీలెండి.. ధనమేరా అన్నింటికీ మూలం అంటూ సాగే ఎస్వీఆర్ పాటైనా విన్నారా.. అదీ లేదా.. అయితే రైలు బండిని నడిపేది పచ్చజెండాలే.. బతుకు బండిని నడిపేది పచ్చనోటేలే అంటూ మన అక్కినేని నాగార్జున పాటైనా వినుంటారుగా.. ఈ కాల గమనంలో ఎంతమంది రచయితలు, హీరోలు మారినా.. సర్వకాల సర్వావస్థలోనూ డబ్బు విలువ మాత్రం మారదనేది కాదనలేని వాస్తవం. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా.. మనీ విలువ మాత్రం మారదనేది నగ్నసత్యం. ఇక ప్రస్తుత రోజుల్లో అయితే రూపాయి ఉంటే కానీ..మనిషి కింద లెక్కేయని పరిస్థితి. మరి మనీ చుట్టూ లోకం తిరుగుతున్న ఈ కాలంలో.. జేబులో డబ్బులేకుండా భారత యాత్ర చేపట్టాడో యువకుడు.. ఇప్పుడా వివరాలు తెలుసుకుందాం..


అతని పేరు విశ్వనాథ్ చౌహన్ .. 20 ఏళ్లు ఉంటాయి. ఊరు బలోదా బజార్.. ఛత్తీస్‌గడ్‌లో ఉంటుంది. 12వ తరగతి వరకూ చదివాడు.. అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ అన్నమాట. అయితే విశ్వనాథ్ మదిలో ఎందుకు పుట్టిందో తెలియదు కానీ.. ఓ వినూత్న ఆలోచన పుట్టింది. అదే భారతదేశ యాత్ర చేపట్టాలని.. దేశంలోని గుళ్లూ, గోపురాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు ఇలా అన్నీ చుట్టేయాలని అనుకున్నాడు. వెంటనే తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాడు. విశ్వనాథ్ తల్లిదండ్రులు మొదట కాస్త తటపటాయించినా.. తర్వాత మనోడి ధైర్యం, పట్టుదల చూసి కాదనలేకపోయారు. దీంతో ఆగస్ట్ 15వ తేదీ విశ్వానాథ్ చౌహన్ యాత్ర మొదలైంది.


దేశం పంద్రాగస్టు వేడుకలు జరుపుకుంటున్న రోజు.. ఇంటి నుంచి బయల్దేరాడు విశ్వనాథ్ చౌహన్. అప్పటి నుంచి పలు రాష్ట్రాలు తిరుగుతూ ఆలయాలను, సందర్శనీయ స్థలాలను దర్శిస్తూ ప్రస్తుతం కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల కు చేరాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. రామేశ్వరం బయల్దేరాడు. ఈ క్రమంలోనే తిరుపతిలో మీడియాకు చిక్కిన విశ్వనాథ్ చౌహన్ తన సాహస యాత్ర గురించి చెప్పుకొచ్చాడు. డబ్బులు లేకుండా ఈ యాత్రను కొనసాగిస్తున్నట్లు విశ్వనాథ్ చెప్తున్నారు. దాతలు ఇచ్చే ఆహారం, మధ్యమధ్యలో నడక, ఎవరైనా లిఫ్ట్ ఇస్తే వారి సాయం.. ఇలా భారత యాత్రను కొనసాగిస్తున్నట్లు విశ్వనాథ్ చౌహన్ చెప్పుకొచ్చారు. మరి ఏ ఉద్దేశంతో మనోడు ఈ సాహస యాత్ర చేపట్టాడో తెలియదు కానీ.. యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని మనసారా కోరుకుందాం..


అయితే రూపాయి లేకుండా ఇంటి నుంచి కాలు కూడా బయటపెట్టలేని ఈ రోజుల్లో.. డబ్బులు లేకుండానే మనోడు దేశయాత్ర సాగిస్తూ ఉండటం విశేషం. అది కూడా 20 ఏళ్ల ప్రాయంలోనే ఇలా దేశ యాత్ర చేపట్టాలని నిర్ణయించుకోవటం మరింత ఆసక్తికరం. ఈ యాత్రకు మనోడు పెట్టుకున్న పేరు ఏంటంటే.. With out Money All india Tour..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa