ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాను చనిపోవడమే కాక బిడ్డను కూడా బలి తీసుకుంది

Crime |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 06:15 PM

అమానుష సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తన ప్రాణాలు అడ్డేసి మరీ బిడ్డను కాపాడుకునే తల్లి.. దారుణానికి ఒడిగట్టింది. తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక.. మూడేళ్ల చిన్నారిని కూడా హత్య చేసింది. అయితే సదరు మహిళ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం.. ఆమె బుర్రలో తిరిగిన ఓ అనుమానం.. భర్త చేసిన ఓ ఆరోపణ. ఈ రెండు ఆమెని కుదురుగా ఉండనీయక.. తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక బిడ్డను కూడా చంపే స్థితికి కారణమైంది. ఆ వివరాలు..


రేబిస్ సోకిందనే అనుమానంతో.. ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సదరు మహిళ తనతో పాటుగా మూడేళ్ల కుమార్తెని కూడా హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణం, కొత్తగంజ్ ప్రాంతంలో నరేష్, యశోద అనే దంపతులు నివాసం ఉండేవారు. వీరికి అనురాగ్, అక్షర అనే ఇద్దరు సంతానం ఉన్నారు.


ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యశోద తన ఇంటి ఆవరణలో పల్లీలు, డ్రైఫ్రూట్స్ ఆరబెట్టింది. అదే సమయంలో ఓ వీధికుక్క వచ్చి వాటిని ఎంగిలి చేసింది. ఏం పర్లేదనుకున్న యశోద వాటిని వంటల్లో వినియోగించింది. కుక్క ఎంగిలి చేసిన వాటిని వాడినప్పటి నుంచి ఇంట్లో అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని భర్త నరేష్ ఆరోపించాడు. దీనిపై దంపతులిద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం.


అనారోగ్య సమస్యలు వెలుగు చూడటంతో.. కుటుంబ సభ్యులందరూ రేబిస్ టీకాలు వేయించుకున్నారు. అలానే ఇతర వైద్యం కూడా చేయించుకున్నారు. కానీ యశోద మనసులో రేబిస్ అనుమానం బలంగా నాటుకుపోయింది. తనకు రేబిస్ సోకిందేమో అన్న భయంతో సోమవారం నాడు ఆత్మహత్య చేసుకుంది. అలానే మూడేళ్ల కుమార్తెను కూడా హత్య చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


భర్త ఉద్యోగానికి వెళ్లగానే ఇంట్లోకి వెళ్లిన యశోద ఆత్మహత్య చేసుకుంది. అయితే చనిపోవడానికి ముందు యశోద కుమారుడు లక్కీ, భర్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ గోడ, డోర్ల మీద రాసింది. ఉదయం ఉద్యోగానికి వెళ్లిన నరేష్ పది గంటల ప్రాంతంలో ఇంటికి కాల్ చేశాడు. కుమారుడు అనురాగ్ కాల్ లిఫ్ట్ చేసి.. తల్లి బెడ్రూమ్‌లోకి వెళ్లి బయటకు రావడం లేదని తెలిపాడు.


దీంతో నరేష్ పక్కింటి వారికి ఫోన్ చేసి.. పరిస్థితి వివరించాడు. వారు వెంటనే నరేష్ ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె బెడ్రూమ్‌లో ఆత్మహత్య చేసుకుని కనిపించింది. మరోవైపు వారి మూడేళ్ల కుమార్తె అక్షర కూడా అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు కనిపించింది. విషయం తెలుసుకున్న నరేష్ వెంటనే ఇంటికి చేరుకున్నాడు.


ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. ‘నా భార్య యశోద తనకు, మా కుమార్తె అక్షర అనారోగ్యానికి కారణం రేబిస్ అని భావించింది. ఆ అనుమానం ఆమెలో బలంగా నాటుకుపోయింది. నాటు వైద్యం చేయించుకుందామని కోరడంతో సరే అన్నాను. నాటు వైద్యం మందులు కూడా వాడటం ప్రారంభించాము. నేను డ్యూటీకి వెళ్లాక.. యశోద అక్కడా, ఇక్కడా పసరు మందు కూడా తీసుకుంది. అయినా సరే ఆమెలో రేబిస్ అనుమానం తొలగిపోలేదు. దీని గురించి మానసికంగా బాధపడసాగింది’ అని తెలిపాడు.


‘రేబిస్ వ్యాధి గురించి తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో కూడా చాలా వేతికింది. అలానే పిల్లలు జాగ్రత్త అని ఎన్నోసార్లు చెప్పింది. తనకు రేబిస్ సోకలేదని ఎంత నచ్చచెప్పినా ప్రయోజనం లేకపోయింది. చివరకు తాను, తనతో పాటు కుమార్తెను కూడా చంపేసిందని’ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa