ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా టెక్ దిగ్గజాలపై డిజిటల్ పన్నులు విధిస్తే మీ పని ఖతం.. ట్రంప్ వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 07:27 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కఠిన వాణిజ్య వైఖరిని కొనసాగిస్తూ.. అమెరికా టెక్ సంస్థలపై డిజిటల్ సేవల పన్నులు, సంక్లిష్టమైన నిబంధనలను విధించే అన్ని దేశాలపై కొత్త సుంకాలు విధిస్తానని తాజాగా బెదిరించారు. ఆల్ఫాబెట్, మెటా, అమెజాన్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీలకు మాత్రమే వర్తించే పన్నులను తగ్గించేలా వాణిజ్య భాగస్వాములపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ట్రంప్ తాజా ఎత్తుగడగా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా తమ దేశానికి చెందిన టెక్ కంపెనీలపై సుంకాలతో దాడిచేసే దేశాలకు వ్యతిరేకంగా తాను నిలబడతానని ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో హెచ్చరించారు.


‘‘అమెరికా టెక్నాలజీకి ముప్పు కలిగించడానికి లేదా విపక్ష చూపేందుకు డిజిటల్ పన్నులు, డిజిటల్ సేవలు చట్టాలు, డిజిటల్ మార్కెట్ల నిబంధనలు వంటివి తీసుకొచ్చాయి.. ఇవి తమ దేశీయ కంపెనీలకు వ్యతిరేకంగా ఉండటమే కాదు చైనా దిగ్గజ సంస్థలకు మినహాయింపు ఇస్తున్నాయి.. ఇకపై ఇది కొనసాగనివ్వను.. దీనికి ముగింపు పలకాల్సిందే’’ అని మండిపడ్డారు. అంతేకాదు, అధిక భద్రత కలిగి తమ టెక్నాలజీ, చిప్‌ల ఎగుమతులపై పరిమితులు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.


‘‘డిజిటల్ పన్నులు, ఆంక్షలు తొలగించకపోతే ఆయా దేశాల నుంచి అమెరికాకు వచ్చే ఎగుమతులపై అదనపు సుంకాలు విధిస్తాను.. అమెరికా, అమెరికా సంస్థలు ఇకపై ప్రపంచానికి ‘పిగ్గీ బ్యాంక్’గానీ, ‘డోర్మాట్’గానీ ఉండవు.. అమెరికా, మా అద్భుతమైన టెక్ సంస్థలను గౌరవించండి.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా, ఐరోపా సమాఖ్య వారం కిందట విడుదల చేసిన సంయుక్త ప్రకటన నేపథ్యంలో ఈ హెచ్చరిక చేయడం గమనార్హం. అన్యాయమైన వాణిజ్య అడ్డంకులను ఎదుర్కొంటామని, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్లపై దిగుమతి సుంకాలు విధించకూడదని అంగీకారానికి వచ్చాయి. యూరోపియన్ యూనియన్ కూడా నెట్‌వర్క్ వినియోగంపై రుసుం విధించబోమని స్పష్టం చేసింది.


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం వాణిజ్య చర్చల్లో డిజిటల్ సేవలు కీలకంగా మారాయి. ఈ ఏడాది జూన్ కెనడా ఈ పన్నులు వేయడంతో అన్ని వాణిజ్య చర్చలను నిలిపివేసినట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా భారత్‌పై అదనంగా విధించిన 25 పన్నులతో కలిపి మొత్తం 50 టారీఫ్‌లు ఆగస్టు 27 (బుధవారం) నుంచి అమల్లోకి వస్తున్నట్టు అమెరికా నోటిసు జారీచేసింది. దీంతో భారత్ ఎగుమతులపై 66 శాతం మేర ప్రభావం చూపనున్నాయి. అయితే, భారత్‌పై సుంకాల కారణంగా చైనా, వియత్నాం వంటి దేశాలు మాత్రం ప్రయోజనం పొందనుండటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa