ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పటికే భార్య చెల్లిని పెళ్లాడాడు, ఇప్పుడు మరో చెల్లి కావాలంటూ టవర్ ఎక్కేశాడు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 08:27 PM

 ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జరిగిన ఒక విచిత్రమైన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అచ్చం బాలీవుడ్‌ సినిమా 'షోలే'లో లాగే.. ఒక యువకుడు తన డిమాండ్‌ను నెరవేర్చాలంటూ ఏకంగా విద్యుత్ టవర్ ఎక్కాడు. సినిమాలో హీరో.. హీరోయిన్‌ను పెళ్లాడేందుకు వాటర్ ట్యాంక్ ఎక్కితే.. ఇక్కడ ఓ యువకుడు తన భార్య చెల్లిని పెళ్లి చేసుకోవాలంటూ హైటెన్షన్ కరెంట్ టవర్ ఎక్కి అందరినీ ఆందోళనకు గురి చేశాడు. అయితే భార్య చనిపోవడంతో ఆమె చెల్లిని రెండో పెళ్లి చేసుకున్న ఇతడు.. రెండో చెల్లిని కూడా తనకే ఇవ్వాలంటూ ఇంత రచ్చ చేశాడు.


వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన రాజ్‌ సక్సేనాకు 2021లో తొలిసారి వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన ఏడాదికే భార్య అనారోగ్య కారణాలతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు తమ వల్లే అల్లుడి జీవితం నాశనం అయిందని భావించి వారి రెండో కుమార్తెను ఇచ్చి పెళ్లి జరిపించారు. ఇన్నాళ్ల పాటు ఆమెతో హాయిగా జీవించిన అతడికి ఓ బాబు కూడా పుట్టాడు. ఈక్రమంలోనే అతడికి రెండో మరదలిపై కన్ను పడింది. చాలా రోజులుగా ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అయితే ఇదే విషయాన్ని తన అత్తామామలకు వివరించాడు. మీ మూడో కుమార్తెను కూడా నాకే ఇవ్వమంటూ అడిగాడు.


కానీ అత్తమామలు ఇందుకు నిరాకరించారు. పెళ్లైన ఏడాదికే భార్య చనిపోయిన జీవితం నాశనం అయిందనే ఉద్దేశంతోనే రెండో బిడ్డను కూడా ఇచ్చి పెళ్లి చేశామని అన్నారు. మూడో కుమార్తెను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎలాగైనా సరే భార్య చెల్లెల్ని దక్కించుకోవాలనుకున్న రాజ్ సక్సేనా.. నేరుగా వెళ్లి హైటెన్షన్ కరెంట్ టవర్ ఎక్కేశాడు. తనకు తన మూడో మరదలిని ఇచ్చి పెళ్లి చేస్తానంటేనే కిందకు దిగుతానంటూ మారాం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా షాక్ అయ్యారు. అలాగే పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులకు వెంటనే సమాచారం అందించారు.


సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆపై రాజ్ సక్సేనాను కిందకు దింపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఎవరు ఎంత చెప్పినా వినని.. రాజ్ సక్సేనా తన భార్య చెల్లిని పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇస్తేనే కిందకు వస్తానని లేకపోతే అక్కడే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాదాపు రెండు గంటల పాటు అతడు పైనే ఉండి.. అందరినీ టెన్షన్ పెట్టాడు. దీంతో చేసేదేమీ లేక మూడో కుమార్తెను కూడా నీకే ఇస్తామని నమ్మబలికి చివరకు అతడిని కిందకు దింపారు.


కిందకు వచ్చాక పోలీసులు అతడితో మాట్లాడారు. అసలీ విచిత్రమైన కోరిక వెనుక ఉన్న అసలు కారణం ఏంటో చెప్పాలన్నారు. కానీ రాజ్ సక్సేనా దీని గురించి నోరు మెదపకుండానే.. ఆమెతో పెళ్లి జరిపించాలంటూ రచ్చ చేశాడు. దీంతో పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చూడాలి మరి అతడు మనసు మార్చుకుంటాడా లేక మరదలి కోసం మళ్లీ ఇలాగే గొడవ చేస్తాడా అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa