ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూ కాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సహా 11 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 08:28 PM

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్, రియాసి జిల్లాల్లో ఆకస్మికంగా సంభవించిన భారీ మేఘావృతం (క్లౌడ్‌బర్స్ట్) వినాశనాన్ని సృష్టించింది. ఈ భీకర ప్రకృతి విపత్తులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది వరదల్లో కొట్టుకుపోయారు. అలాగే అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది.


రాంబన్‌లోని రాజ్‌గఢ్ ప్రాంతంలో శుక్రవారం రోజు రాత్రి సంభవించిన ఈ మేఘావృతంతో ఒక్కసారిగా భీకరమైన వరదలు పోటెత్తాయి. వరదల ధాటికి పలు ఇళ్లు, చెట్లు, కరెంటు స్తంభాలు వంటివన్నీ కొట్టుకుపోయాయి. ఈ దుర్ఘటనలో బద్దర్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల నజీర్ అహ్మద్ ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయింది. రాత్రిపూట నేరుగా ఈయన ఇంటిపైనే కొండచరియలు విరిగిపడడంతో.. ఇంట్లో నిద్రిస్తున్న నజీర్ అహ్మద్, ఆనయ భార్య, 5 నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయితే శిథిలాల కింద నుంచి వీరందరి మృతదేహాలను అధికారులు బయటకు తీశారు.


 అలాగే రాంబల్ జిల్లాలోని రాజ్‌గ్రా గ్రామంలోనూ కొండచరియలు విరిగిపడగా... ఐదుగురు వ్యక్తులు వరదల్లో కొట్టుకుపోయారు. ఇందులో ఇప్పటికే నలుగురు మృతదేహాలు లభ్యం కాగా.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన వాళ్లలో ఓం రాజ్, విధియా దేవి, ద్వారకా నాథ్, మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరితంగా పెరిగే అవకాశం ఉందని కూడా వివరిస్తున్నారు. అదృశ్యమైన వారి కోసం సహాయక బృందాలు ఇప్పటికీ గాలింపు చేస్తూనే ఉన్నాయి.


ఈ భీకర వరదల కారణంగా చాలా గ్రామాలతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యంగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బాధితులకు అవసరమైన ఆహారం, నీరు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. తాజా వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో కాశ్మీర్ లోయలోని అన్ని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు.


గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలే ఈ మేఘావృతానికి, కొండచరియలు విరిగిపడటానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్‌మెంట్  హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికల ప్రకారం రుతుపవనాలు, వెస్ట్రన్ డిస్టర్బెన్స్ల కలయిక కారణంగా ఈ విధమైన విపత్తులు సంభవించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. ఈ పరిస్థితి ఇంకా 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగే ప్రమాదం ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa