ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ తగ్గుతున్న చమురు ధరలు.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు

business |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 10:43 PM

చమురు ధరలు మళ్లీ పడిపోతున్నాయి. ఇటీవల పశ్చిమాసియా దేశాల్లో రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక్కసారిగా కనిష్ట స్థాయిల నుంచి పెరిగిన సంగతి తెలిసిందే. అంతకుముందు రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో.. ఒక దశలో బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా 130 డాలర్లు దాటి ట్రేడయింది. తర్వాత సగానికిపైగా తగ్గిందని చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో పుంజుకోగా.. ఇప్పుడు పతనం అవుతుంది. వారాంతంలో నష్టపోయే దిశగానే పయనిస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు వినియోగ దేశమైన అమెరికాలో.. ఇప్పుడు డిమాండ్ తగ్గుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు రష్యాలో లభ్యతపైనా అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ముడిచమురు ధరలు పతనం అవుతున్నాయి.


అక్టోబర్ డెలివరీ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 50 సెంట్లు లేదా 0.7 శాతం పడిపోయి 68.12 డాలర్ల వద్ద ఉంది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ఫ్యూచర్స్ 45 సెంట్లు లేదా 0.7 శాతం పతనంతో 64.15 డాలర్లకు చేరింది. దీంతో వారాంతంలో నష్టాలతోనే ముగియనున్నట్లు అంచనా వేస్తున్నారు.


ఈ వారం మొదట్లో ఉక్రెయిన్.. రష్యన్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్ టెర్మినల్స్‌పై దాడి చేసిన సమయంలో చమురు ధరలు ఎగబాకాయి. మరోవైపు వచ్చే వారం ఒపెక్ మీటింగ్ జరగనుంది. గ్లోబల్ డిమాండ్‌ను అందుకునేలా క్రూడ్ ఉత్పత్తిని పెంచాలని నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్లు ఇప్పుడు భారత్ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దిగుమతి సుంకాల్ని 25 నుంచి ఒకేసారి 50 శాతానికి పెంచింది. అయినా కూడా భారత్.. రష్యా నుంచి ఇంకా దిగుమతుల్ని పెంచినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో డిమాండ్ తగ్గడం, లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఏషియన్ బయ్యర్స్‌కు.. సౌదీ అరేబియా ధరల్ని తగ్గించనున్నట్లు సమాచారం.


>> అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. దేశీయంగా మాత్రం రెండేళ్లకుపైగా రేట్లలో పెద్దగా మార్పులేదు. ఆ మధ్య లోక్‌సభ ఎన్నికలకు ముందు.. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 2 చొప్పున మాత్రమే తగ్గించింది. అంతకుముందు యుద్ధాల సమయంలో ఇంధన ధరలు భారీగానే పెరిగినా.. ఇక్కడ దేశీయంగా ధరల్ని పెంచకుండా నష్టాల్ని ఎదుర్కొన్నాయి. దీంతోనే తర్వాత రేట్లు దిగొస్తున్నా ఇక్కడ దేశీయంగా గరిష్ట స్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే రేట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ. 95.70 గా ఉంది. లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa