ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన జెలెన్‌స్కీ.. కాసేపటికే రష్యాపై కీలక ప్రకటన

international |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 05:12 PM

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ శనివారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన కాసేపటికే కీలక ప్రకటన చేశారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్ అన్ని విధాలా సహకారం అందిస్తుందని, ఈ విషయంలో రష్యాకు 'సరైన సంకేతం' ఇస్తుందని జెలెన్‌స్కీ తెలిపారు. చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ జరిపే సమావేశానికి ముందు ఈ ఫోన్ కాల్ మాట్లాడడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.


రెండు దేశాల మధ్య జరిగిన ఈ టెలిఫోన్ సంభాషణలో జెలెన్‌స్కీ.. రష్యా అగ్ర నాయకత్వంతో సమావేశానికి తాము సిద్ధంగా ఉన్నామని, యుద్ధం తక్షణ కాల్పుల విరమణతో ముగియాలని కోరారు. ఈక్రమంలోనే ఎక్స్ వేదికగా ఓ పోస్టు కూడా పెట్టారు. అందులో.. “అవసరమైన ప్రయత్నాలను చేసి, రష్యాకు సరైన సంకేతం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉంది” అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా జరిగే సమావేశాల్లో రష్యాతో పాటు ఇతర దేశాల నాయకులకు కూడా సరైన సంకేతం పంపడానికి భారత్ అవసరమైన కృషి చేస్తుందని తాను నమ్ముతున్నట్లు వివరించారు.


ప్రధాని మోదీ ఏమన్నారంటే..?


అయితే భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ నేరుగా ప్రధాని మోదీయే జెలెన్‌స్కీ ఫోన్ చేసి తనతో మాట్లాడిన విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ముఖ్యంగా తనకు ఫోన్ చేసిన జెలెన్‌స్కీకి ధన్యవాదాలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ, మానవాళిపై దాని ప్రభావం, శాంతి సుస్థిరతల స్థాపన గురించి తాము మాట్లాడుకున్నట్లు చెప్పారు. భారత్ మొదటి నుంచి రష్యా-ఉక్రెయిన్ ఘర్షణను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించాలని చెబుతూ వస్తోంది. ముఖ్యంగా జెలెన్‌స్కీ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ సంఘర్షణను శాంతియుతంగా పరిష్కరించేందుకు, త్వరగా శాంతిని పునరుద్ధరించడానికి భారత కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.


గత సంవత్సరం జూలైలో ప్రధాని మోదీ మాస్కోకు వెళ్లి.. “యుద్ధభూమిలో ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారం లభించదు. బాంబులు, తూటాల మధ్య శాంతి ప్రయత్నాలు విజయం సాధించవు” అని పుతిన్‌తో చెప్పారు. ఆ తర్వాత నెలలోనే మోదీ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సందర్శించి.. “యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్, రష్యా ఇద్దరూ సమయం వృథా చేయకుండా కలిసి కూర్చుని చర్చించుకోవాలి” అని జెలెన్‌స్కీకి సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa