ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హౌతీ తిరుగుబాటుదారులకు కోలుకోలేని దెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ప్రధాని సహా పలువురు మంత్రులు హతం

international |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 05:24 PM

యెమెన్ రాజధాని సనాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దాడుల్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటు ప్రభుత్వం ప్రధాని అహ్మద్ అల్ రహావి సహా పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు హతమయ్యారు. మరెంతో మంది అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన హౌతీల బలాన్ని దెబ్బ తీసిందని, ఇది యెమెన్ యుద్ధంలో ఒక కీలక మలుపు అని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (IDF) ఈ దాడిని పక్కా ప్రణాళికతో నిర్వహించాయి. హౌతీ ప్రధాని అహ్మద్ అల్ రహావి సనా నగరంలో గురువారం రోజు ఓ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గతేడాది సర్కారు కార్యకలాపాలు, పనితీరును అంచనా వేసేందుకు ఈ భేటీ జరిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్.. ఆ సమావేశం జరుగుతున్న ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ప్రధానితో పాటు మరికొంత మంది కీలక హౌతీ నేతలు కూడా మరణించారని హౌతీల అధికారిక మీడియా సంస్థలు ధృవీకరించాయి.


యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మద్దతు ఉన్న ప్రభుత్వానికి మధ్య చాలా సంవత్సరాలుగా అంతర్యుద్ధం జరుగుతోంది. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లోని ప్రధాన ప్రాంతాలను, ముఖ్యంగా రాజధాని సనాతో పాటు అనేక కీలక నగరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలపై హౌతీలు దాడులు చేయడంతో ఇజ్రాయెల్, అమెరికాతో పాటు ఇతర దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఈ దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందని చాలా కాలంగా అంచనా వేస్తున్నారు. అయితే ఒక దేశ ప్రధానిపైనే నేరుగా దాడి చేయడం ఈ సంఘర్షణను మరింత తీవ్రం చేస్తుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


హౌతీలు ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇజ్రాయెల్ చేసిన ఉగ్రదాడి అని ఆరోపించారు. దీనికి ప్రతీకారం తప్పక ఉంటుందని హౌతీ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత యెమెన్‌లో, ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని భద్రతా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. సాధారణంగా ఇలాంటి కీలక సైనిక చర్యలపై ఇజ్రాయెల్ మౌనం పాటిస్తుంది.


యెమెన్‌లో హౌతీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అహ్మద్ అల్ రహావి ముఖ్యమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన మరణం హౌతీల నాయకత్వంలో గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని, ఇది యెమెన్ అంతర్యుద్ధంలో భవిష్యత్ పరిణామాలను ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వైమానిక దాడి మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ సంఘటన మరిన్ని భద్రతా సవాళ్లకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa