చైనా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఆయన అర్ధాంగి పెంగ్ లియువాన్ సాదర స్వాగతం పలికారు. టియాంజిన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన దేశాధినేతల గౌరవార్థం ఏర్పాటు చేసిన అధికారిక విందుకు మోదీని వారు ఆదివారం ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోదీ.. జిన్పింగ్ దంపతులతో కరచాలనం చేసి, వారితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఇతర ప్రపంచ నేతలతో కలిసి గ్రూప్ ఫొటో సెషన్ లో పాల్గొన్నారు.ఈ విందుకు ముందు, ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య కీలక ద్వైపాక్షిక సమావేశం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని ఇరువురు నేతలు ఈ భేటీలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలు, సున్నితత్వాల ప్రాతిపదికన సహకారాన్ని కొనసాగించాలని పునరుద్ఘాటించారు. ఈ సమావేశం ఎంతో ఫలప్రదంగా జరిగిందని, భారత్-చైనా సంబంధాల్లో సానుకూల పురోగతిని సమీక్షించామని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.రెండు రోజుల ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు జపాన్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ శనివారం చైనాలోని టియాంజిన్కు చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా, ఆయన చైనా పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాయ్ చీతో భేటీ అయి ఆర్థిక, రాజకీయ, ప్రజా సంబంధాలపై చర్చించారు. అలాగే, సదస్సు వేదికగా మయన్మార్, నేపాల్, మాల్దీవుల అధినేతలతోనూ ఆయన విడివిడిగా సమావేశమయ్యారు.షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 2001లో ఏర్పాటైన ఒక శాశ్వత అంతర్జాతీయ సంస్థ. ప్రస్తుతం ఇందులో చైనా, రష్యా, భారత్తో పాటు మొత్తం 10 సభ్య దేశాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa