దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా గణేషుడి విగ్రహాలు కొలువయ్యాయి. కొన్నిచోట్ల ఇప్పటికే గణనాథుడి నిమజ్జన ప్రక్రియలు మొదలయ్యాయి కూడా. అయితే.. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన ఓ వినాయకుడి విగ్రహం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా నిలిచింది. మంగళగరిలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి చేసిన అలంకరణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళగిరి మెయిన్ బజార్ వర్తక సంఘం ఆధ్వర్యంలో రూ.2.35 కోట్ల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో గణేశుడి విగ్రహాన్ని అలంకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వినాయక చవితిని పురస్కరించుకుని మంగళగిరి మెయిన్ బజారులో ఉగ్ర నరసింహ ఇతివృత్తంతో గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని మంగళగిరి మెయిన్ బజార్ వర్తక సంఘం కరెన్సీ నోట్లతో అలంకరించింది. 500, 200, 100, 50, 20 రూపాయల కొత్త నోట్లతో విగ్రహాన్ని అలంకరించింది. ఇందుకోసం మొత్తంగా రూ.2.35 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను వినియోగించారు. అయితే ఈ కరెన్సీ నోట్ల అలంకరణ కేవలం ఒక్కరోజుకే పరిమితం చేశారు. సెక్యూరిటీ కారణాలతో కేవలం ఒక్కరోజే స్వామివారిని కరెన్సీ నోట్లతో అలంకరించినట్లు మంగళగిరి మెయిన్ బజార్ వర్తక సంఘం ప్రతినిధులు తెలిపారు. 11 రోజుల పాటు రక్షణ కల్పించడం కష్టమనే ఉద్దేశంతో.. కేవలం ఒక్కరోజుకే ఈ అలంకరణను పరిమితం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
మంగళగిరి మెయిన్ బజారులో వినాయక చవితి పండుగను 25 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు. గత ఐదు సంవత్సరాలుగా, గణేశుడిని కొత్త నోట్లతో అలంకరించడం సంప్రదాయంగా మారింది. 2024లో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఏపీ ప్రభుత్వం ధ్రువీకరించటంతో.. విగ్రహాన్ని రూ.2.20 కోట్లతో అలంకరించారు. ఈ సంవత్సరం గతేడాది రికార్డును బద్ధలు కొడుతూ రూ..2.35 కోట్ల కరెన్సీ నోట్లతో వినాయకుడి విగ్రహాన్ని అలంకరించారు. అయితే ఈ కార్యక్రమానికి మూడు నెలల ముందుగానే సన్నాహాలు ప్రారంభిస్తారు. వ్యాపారులు తమ బ్యాంకు ఖాతాల నుంచి నిధులను సమీకరిస్తారు. ఇలా సేకరించిన డబ్బును కొత్త నోట్లుగా మారుస్తారు, ఆ తర్వాత వీటిని గణేష్ మండపాన్ని అలంకరించడానికి ఉపయోగిస్తారు.
వినాయక చవితి వేడుకలు పూర్తైన తర్వాత.. ఈ కరెన్సీ నోట్లను మరోసారి లెక్కించి ప్రతి వ్యాపారికి తిరిగి ఇస్తారు. అయితే గణేశుడి అలంకరణ కోసం ఇలా కరెన్సీ నోట్లను ఇవ్వడం వల్ల అదృష్టం వస్తుందనే నమ్మకంతో వ్యాపారులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. మంగళగిరి మెయిన్ బజారులో ఉన్న ప్రతి వ్యాపారస్తుడు ఇందులో పాల్గొంటారని స్థానికులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa