ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదే పదే కాలింగ్ బెల్ కొడుతున్నాడని 11 ఏళ్ల బాలుడిపై దారుణం

international |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 09:05 PM

సాధారణంగా చిన్న పిల్లలు ఉన్న అపార్ట్‌మెంట్లలో సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. పిల్లలంతా ఓచోట చేరి అల్లరి పనులు చేస్తూ అందరికీ చిరాకు తెప్పిస్తుంటారు. పదే పదే కాలింగ్ బెల్ నొక్కుతూ.. తలుపులు తెరిచే సరికి పారిపోతుంటారు. ఇలాంటిది మన జీవితంలోనూ ఏదో ఒకసారి జరిగే ఉంటుంది. అయితే ఆ క్షణాన పిల్లలపై విపరీతమైన కోపం వచ్చి కొట్టేందుకు అక్కడకు వెళ్లినా.. వారి అమాయకపు ముఖాలు చూసి ఊరుకుండిపోతాం. లేదంటో ఏవో రెండు మాటలు తిట్టేసి, బెదిరించి మిన్నుకుండిపోతాం.


కానీ అమెరికాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. అచ్చంగా ఇలాంటి ఆటే ఆడాడో 11 ఏళ్ల బాలుడు. పదే పదే కాలిగ్ బెల్ కొడుతూ పారిపోయాడు. దీంతో విపరీతమైన కోపం తెచ్చుకున్న ఇంటి యజమాని.. తలుపు వద్దే వేచి ఉన్నాడు. బాలుడు బెల్ నొక్కబోతుండగా.. ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఇలా బుల్లెట్ బాలుడి శరీరంలోకి దూసుకెళ్లగా.. అతడు చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.


అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిందీ దారుణ ఘటన. ముఖ్యంగా పదే పదే కాలింగ్ బెల్ కొడుతూ పారిపోయే ఆటను అమెరికాలో 'డింగ్ డాంగ్ డిచింగ్'గా పిలుస్తుంటారు. అయితే చాలా మంది ఈ ఆట ఆడుతూ.. సరదాగా అల్లరి చేస్తారు. అచ్చంగా ఇదే పని చేశాడో 11 ఏళ్ల బాలుడు. శనివారం రోజు రాత్రి హ్యూస్టన్‌లోని ఈస్ట్‌సైడ్‌లో.. తన అపార్ట్‌మెంట్‌ భవనంలోనే బాలుడు ఈ ఆట ఆడాడు. తన స్నేహితులతో కలిసి చుట్టూ ఉన్న ఇళ్లలో డోర్‌ బెల్‌లు మోగిస్తూ.. తలుపు తీసేలోపే పారిపోతూ ఆడుకుంటున్నాడు.


అయితే 9700 బ్లాక్ ఆఫ్ మిమ్‌బ్రోగ్‌లోని ఒక ఇంటి వద్ద వారు ఈ ప్రాంక్ చేస్తున్నప్పుడు.. ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి పారిపోతున్న పిల్లలపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 11 ఏళ్ల బాలుడు వెనుక భాగంలో తీవ్రంగా గాయమై కుప్పకూలిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయిత చికిత్సపొందుతూ బాలుడు ఆదివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై హ్యూస్టన్ పోలీసులు వెంటనే స్పందించారు. ఆ ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు నిందితుడి పేరు గానీ, అతడిపై నమోదు చేసిన అభియోగాలను గానీ పోలీసులు వెల్లడించలేదు. కానీ ఇప్పటికే పోలీసులు ఆ ఇంట్లో సోదాలు నిర్వహించి అనేక రైఫిల్స్, హ్యాండ్ గన్‌లను స్వాధీనం చేసుకున్నారు.


ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సరదాగా ఆడుకుంటున్న చిన్న పిల్లలపై కోపం తెచ్చుకుని కాల్పులు జరపడం దారుణం అని అన్నారు. చిన్నారి ప్రాణాలు పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నివాసి థెరిసా జోన్స్ మాట్లాడుతూ.. "ఇది నిజంగా చాలా బాధాకరం. పిల్లల చుట్టూ తుపాకులు, ఇలాంటి కోపిష్టిలు ఉండకూడదు" అని అన్నారు. మరొక వ్యక్తి మాట్లాడుతూ.. "పిల్లలు డోర్‌బెల్‌తో ఆడుకుంటే వారికి ఏం నష్టం జరుగుతుంది? వారు పిల్లలని తెలిసి కూడా కాల్చడం అన్యాయం?" అని పేర్కొన్నారు. ప్రస్తుతం హ్యూస్టన్ పోలీసులు హారిస్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంతో కలిసి ఈ కేసులో తదుపరి చర్యల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికుల నుంచి సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సేకరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa