ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫ్గానిస్థాన్‌లో విషాదం నింపిన భూకంపం.. 800 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 09:06 PM

అఫ్ఘానిస్థాన్‌లో ఆదివారం (ఆగస్టు 31) రాత్రి సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య 800 దాటింది. 2500 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు తొలుతు 250 మంది మాత్రమే చనిపోయారని, 500 మంది మాత్రమే గాయపడ్డారని అంచనా వేశారు. కానీ, సహాయక చర్యలు కొనసాగుతున్నకొద్దీ.. శిథిలాల కింద నుంచి మృతదేహాలు, క్షతగాత్రులు బయటపడుతున్నారు. కొంత మందిని ప్రాణాలతో బయటకు తీసుకొస్తున్నారు. రోడ్లు సరిగ్గా లేకపోవడం, భవనాలన్నీ కుప్పకూలిపోవడం, అటవీ ప్రాంతం, కొండల్లో ఎక్కువగా నివాసాలు ఉండడం వల్ల సహాయక చర్యలు అందించడం కష్టం అవుతోందని అధికారులు చెబుతున్నారు.


మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. అఫ్గాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ తెలిపారు. దూరంగా ఉండే గ్రామాల్లో ఎంత మంది చనిపోయారనే దానిపై పూర్తిగా నిర్ధారణకు రాలేకపోయామని వివరించారు. ఆ ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా ఉందని, అందుకే మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. ఈ భూకంపం వల్ల కునార్, నంగర్హార్ ప్రావిన్సులలోని పలు గ్రామాలు పూర్తిగా నాశనం కాగా.. కాబూల్ నుంచి బయలుదేరిన వైద్య బృందాలు కూడా సహాయక చర్యలలో పాల్గొంటున్నాయని తెలిపారు.


వినాశకరమైన ఈ భూకంపం అర్థరాత్రి సంభవించింది. ముఖ్యంగా ప్రజలంతా ఇళ్లల్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా భవనాలు కుప్పకూలాయి. ఫలితంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అందుల్లో చిన్నపిల్లలు, మహిళలు సహా వృద్ధులు కూడా ఉన్నారు. ఈ భూకంపం వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం, మారుమూల ప్రాంతాల నుంచి సమాచారం సేకరించడం కష్టం కావడం వల్ల మృతులు, గాయపడినవారి కచ్చితమైన సంఖ్య ఇంకా తెలియరాలేదు. అలాగే వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాడనికి కూడా కాస్త అలస్యం అవుతోంది.


మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు చేరుకోవడానికి రెస్క్యూ బృందాలు హెలికాప్టర్లను కూడా ఉపయోగిస్తున్నాయి. ఇవి గాయపడినవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో పెద్ద ఎత్తున సహాయ పడుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ఈ దేశానికి తాజాగా పెను విపత్తు రావడంతో మరింత కష్టాలను ఎదుర్కుంటోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సహాయం కోసం ఎదురు చూస్తుంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క దేశం కూడా అఫ్గాన్‌కు సాయం చేస్తామని, అండగా ఉంటామని ప్రకటించలేదు. మరోవైపు అక్కడి ప్రజలే నేరుగా అంతర్జాతీయ సమాజం సాయం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సాయం చేయమని కోరుతున్నారు.


గూగుల్ ట్రెండ్స్‌లో అఫ్ఘానిస్థాన్ భూకంపం


అఫ్ఘానిస్థాన్ భూకంపానికి సంబంధించిన వార్తల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. దీంతో అఫ్ఘానిస్థాన్ భూకంపం గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. ఆపదలో ఉన్న అఫ్ఘానిస్థాన్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ ప్రకటించింది. ‘బాధితులకు అన్ని రకాలుగా సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. మానవతా సహాయం, రిలీఫ్ మెటీరియల్ అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. భారత్‌లో జమ్మూ కాశ్మీర్‌లో అఫ్ఘానిస్థాన్ భూకంపం గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, చంఢీగడ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో ఎక్కువ మంది ఈ వార్తల గురించి ఆరా తీశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa