ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్గానిస్థాన్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం.. 250 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 09:10 PM

 అఫ్గానిస్థాన్‌ను పెను విషాదం ఆవరించింది. 6.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. నిద్రలో ఉన్న ప్రజలను భయంకరంగా వణికించిన ఈ భూకంపం.. వందలాది మంది ప్రాణాలను బలిగొంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ విపత్తులో కనీసం 250 మందికి పైగా మరణించగా, 500 మందికి పైగా గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడి అయింది. 8 కిలో మీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉండగా.. ఆదివారం రోజు అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దుర్ఘటనలో 250 మంది మృతి చెందారని అనడోలు ఏజెన్సీ ప్రకటించింది. మరో 500 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు వివరించింది. భూకంపం ప్రభావం ముఖ్యంగా పక్తికా, ఖోస్ట్ ప్రావిన్స్‌లలో తీవ్రంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాలు భౌగోళికంగా కొండ ప్రాంతాలు కావడంతో సహాయక చర్యలు చేపట్టడం చాలా కష్టంగా మారింది.


  భూకంపం ధాటికి చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇవన్నీ బలహీనమైన నిర్మాణాలతో కూడుకున్నవి కావడంతో నష్టం భారీగా జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోయారని, వారిని వెలికి తీయడం ఒక పెద్ద సవాలుగా మారిందని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేకపోవడం, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక బృందాలు బాధితులను చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఇప్పటికే అనేక మందిని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తుడగా.. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


ఈ విపత్తు వల్ల ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అఫ్గానిస్థాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, తీవ్రమైన పేదరికంతో పోరాడుతోంది. ఇలాంటి సమయంలోనే ఈ విపత్తు సంభవించి.. ఆ దేశంపై మరింత భారాన్ని మోపింది. ముఖ్యంగా భూకంప తీవ్రతకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వారికి సాయం చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. బాధితులకు అత్యవసర సహాయం అవసరం అని చెప్పుకొస్తున్నారు. అసమర్థ తాలిబన్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని.. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా అవసరమైన ఆహారం అందించి ఆశ్రయం కల్పించాలని అంటున్నారు. వీలైనంత వరకు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సాయం చేయాలని వివరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa