ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీఐ సరికొత్త రికార్డ్,,,,నెల రోజుల్లో చేతులు మారిన రూ.25 లక్షల కోట్లు

business |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 10:23 PM

భారత్‌లో యూపీఐ ట్రాన్సాక్షన్లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లలో చిన్న చిన్న వస్తువుల కొనుగోలు నుంచి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్ల వరకు యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. దీంతో గత ఆగస్టు నెలలోనే ఈ ట్రాన్సాక్షన్లు 20 బిలియన్లు అంటే 2 వేల కోట్లు దాటాయి. ఈ ట్రాన్సాక్షన్ల విలువ రూ.24.85 లక్షల కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ట్రాన్సాక్షన్ల పరంగా రికార్డులు నమోదయ్యాయి. అయితే విలువ పరంగా చూస్తే గత జూలై, 2025 నెలతో పోలిస్తే కాస్త తగ్గాయి.


జూలై నెలలో యూపీఐ పేమెంట్ల ద్వారా రూ.25.08 లక్షల కోట్ల నగదు బదిలీ జరిగింది. లావాదేవీల పరంగా చూస్తే గత ఆగస్టు 2025లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 33 శాతం వృద్ధి నమోదైంది. అంటే ఎప్పటికప్పుడు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. యూపీఐ యాప్స్ వినియోగం చాలా సులభంగా, సురక్షితంగా ఉండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. మరోవైపు.. రికార్డు స్థాయిలో ట్రాన్సాక్షన్లు జరిగేందుకు పండుగల సీజన్ కలిసొచ్చింది. ఆగస్టు 2వ తేదీ ఒక్క రోజే ఏకంగా 700 మిలియన్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. యూపీఐ చరిత్రలోనే ఇది అత్యధికం. ఆ వెంటనే ఇంకో రోజు 721 మిలియన్ల ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. కొత్త రికార్డులు సృష్టిస్తూ యూపీఐ పేమెంట్లు పరుగులు పెడుతున్నాయి.


ఒక్క రోజులో రూ.100 కోట్లు విలువైన యూపీఐ లావాదేవీలు జరగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది నాటికల్లా ఈ లక్ష్యం నెరవేరవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని కేంద్రం ఇటీవలే స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ ఓ ప్రకటన చేశారు. యూపీఐ సేవలు సజావుగా సాగేందుకు గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.8,730 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు చెప్పారు.


నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ని తీసుకొచ్చింది. తక్కువ సమయంలోనే యూపీఐ ప్రజల్లోకి వెళ్లింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక యూపీఐ యాప్ వినియోగిస్తున్నారు. యూపీఐ వాడకం క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం దేశం మొత్తం జరుగుతోన్న డిజిటల్ పేమెంట్లలో 85 శాతం యూపీఐ వాటానే ఉండడం గమనార్హం. ఇక ప్రపంచ రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్లలోనూ 50 శాతం ఒక భారత్‌లోనే జరుగుతుండడం విశేషమని చెప్పాలి. ప్రస్తుతం భారత్ సహా సింగపూర్, యూఏఈ, భూటాన్, నేపాల్, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ వంటి ఏడు దేశాలు యూపీఐ పేమెంట్లకు అనుమతిస్తున్నాయి. అలాగే బ్రిక్స్ దేశాలకు యూపీఐ సేవలను విస్తరించాలని భారత్ భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa