ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ, తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. ఆగస్టులో రూ.1.86 లక్షల కోట్లకు చేరిక

business |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 10:24 PM

వస్తు, సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత ఆగస్టు, 2025లో రూ.1.86 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతే ఏడాది ఆగస్టు నెలతో పోలిస్తే ఈసారి 6.5 శాతం మేర పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం గణాంకాలు విడుదల చేసింది. గత జూలై నెలతో పోలిస్తే మాత్రం వసూళ్లు తగ్గాయి. జూలై, 2025 నెలలో రూ.1.96 లక్షల కోట్లు వసూలవగా ఈసారి కాస్త తగ్గాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్, 2025 నెలలో జీఎస్టీ వసూళ్ల చరిత్రలోనే అత్యధికంగా రూ.2.37 లక్షల కోట్లు వచ్చిన సంగతి తెలిసిందే.


ఏపీ, తెలంగాణలో పెరిగిన వసూళ్లు


ఆగస్టు నెలలో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ అదరగొట్టింది. గణనీయమైన వృద్ధి కనబరిచింది. గత ఏడాది ఆగస్టు 2024తో పోలిస్తే ఈసారి 21 శాతం ఎక్కువ జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. 2024, ఆగస్టులో ఇదే సమయానికి 3,298 కోట్ల జీఎస్టీ వసూళ్లు రాగా ఈసారి ఆగస్టు 2025లో ఈ మొత్తం రూ.3,989 కోట్లుగా నమోదైంది. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే జీఎస్టీ వసూళ్లలో 12 శాతం పెరుగుదల కనిపించింది. గత ఏడాది 2024, ఆగస్టు నెలలో చూస్తే రూ.4,569 కోట్లు వసూలయ్యాయి. ఈసారి ఆగస్టు, 2025లో అది రూ.5,103 కోట్లు వచ్చాయి.


 నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళి నాటికి జీఎస్టీ రేట్లు తగ్గించి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ప్రధాని మోదీ ప్రకటన చేసిన వెంటనే ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం జీఎస్టీపై కీలక ప్రకటన చేసింది. జీఎస్టీలో రెండు శ్లాబులు 12, 28 శాతం తొలగించి 5, 18 శాతం మాత్రమే ఉంచుతామని తెలిపింది.


ప్రస్తుతం జీఎస్టీలో 5, 12,18, 28 శ్లాబులు ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ మండలి సెప్టెంబర్ 3-4 తేదీల్లో భేటీ కానుంది. ఈ సమావేశంలోనే జీఎస్టీ రేట్ల మార్పులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ మొదలైపోయింది. కొనుగోలుదారుల నుంచి ఆసక్తి, గిరాకీ బలంగానే ఉన్నా జీఎస్టీ రేట్లు తగ్గిస్తే ధరలు తగ్గుతాయని ఆ తర్వాతే కొనుగోలు చేయాలనే ధోరణి పాటిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. జీఎస్టీ రేట్లపై స్పష్టత వసతే అమ్మకాలు ఒక్కసారిగా పుంజుకుటాయని అంటున్నారు. ఈసారి జీఎస్టీ వసూళ్లు తగ్గేందుకు సైతం ఇదే కారణం కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa