షీనా బోరా హత్య కేసు ఏళ్ల తరబడి సాగుతూనే ఉంది. ఈకేసులో ఇంద్రాణీ ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా నిందితులుగా ఉన్నారు. ఇక ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా కుమార్తె విధి ముఖర్జియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో భాగంగా తాను సీబీఐ ఎదుట ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని ఆమె వెల్లడించారు. అంతేకాక ప్రస్తుతం సీబీఐ చూపుతున్న వాంగ్మూలాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. విచారణ అధికారులు తన చేత కొన్ని పేపర్ల మీద బలవంతంగా సంతంకాలు పెట్టించుకున్నారని విధి ఆరోపించారు. అవన్నీ పూర్తిగా ఫోర్జరీ చేసినవని తెలిపారు. అలానే ఈ కేసును వాదించుకోవడానికి ప్రస్తుతం ఇంద్రాణీ వద్ద రూపాయి కూడా లేదంటూ విధి ముఖర్జియా తెలిపారు.
ప్రస్తుతం ఇంద్రాణీ ముఖర్జియా వద్ద రూపాయి కూడా లేదని.. పీటర్ ముఖర్జీ కొడుకులు రాహుల్, రాబిన్ ఆమె డబ్బులు, నగలు దొంగిలించారని విధి చెప్పుకొచ్చింది. సుమారు ఏడు కోట్ల రూపాయలు దొంగతనం చేశారని వెల్లడించింది. తాజాగా విధి ముఖర్జీ సీబీఐ ప్రత్యేక కోర్టులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చింది. జడ్జి జె.పి. దారేకర్ ముందు ఆమె మాట్లాడింది. ఈ సందర్భంగా విధి ముఖర్జియా మాట్లాడుతూ.. సీబీఐ ఛార్జ్ షీట్లో ఉన్న పత్రాలు కొన్ని నకిలీవి, వాటిని తయారు చేశారని ఆమె కోర్టుకు తెలిపింది. అలానే సీబీఐ అధికారులు చూపించిన కొన్ని డాక్యుమెంట్లు నిజమైనవి కావని ఆమె చెప్పింది. కావాలనే ఇంద్రాణీ ముఖర్జియాను ఈ కేసులో ఇరికించారని ఆమె ఆరోపించింది.
అలానే ఇంద్రాణీ ముఖర్జియాను అరెస్ట్ చేసినప్పుడు తాను మైనర్ అని.. ఆ ఘటనను ఇంకా మరిచిపోలేకపోతున్నా అని విధి ముఖర్జియా చెప్పుకొచ్చింది. అలానే ఈ కేసు విచారణ నిమిత్తం తాను ముంబై పోలీసుల ఎదుట హజరై.. సాక్షిగా ఉన్న విషయాన్ని ఆమె అంగీకరించింది. అయితే ప్రస్తుతం సీబీఐ అధికారులు చూపుతున్న వాంగ్మూలాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అవన్నీ ఫోర్జరీ చేసినవి అని ఆమె కొట్టి పారేసింది. తన బయోలాజికల్ తల్లిదండ్రులైన ఇంద్రాణీ, సంజీవ్ను కావాలనే ఈ కేసులో ఇరికించాలనే కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
అలానే షీనా బోరాతో తన పరిచయాన్ని ఈ సందర్భంగా విధి ముఖర్జియా గుర్తు చేసుకున్నారు. షీనా తనను తాను ఇంద్రాణీ ముఖర్జియాకు సోదరిగా తనకు పరిచయం చేసుకుందని విధి గుర్తు చేసుకుంది. అలానే ప్రారంభంలో ఇంద్రాణి, షీనా చాలా బాగా ఉండేవారని.. కానీ పీటర్ కొడుకు రాహుల్ ముంబైలోని వర్లీ ప్లాట్కు రావడం మొదలైన తర్వాతే షీనా, ఇంద్రాణీల మధ్య విబేధాలు తలెత్తాయని పేర్కొన్నారు. అలానే షీనా, రాహుల్ డ్రగ్స్ తీసుకుంటారనే విషయం తెలిశాక పరిస్థితి మరింత దిగజారిపోయిందని వివరించింది.
తాను 2011లో చివరిసారి గోవాలో జరిగిన ఓ పెళ్లిలో షీనాను కలిశానని విధి గుర్తు చేసుకుంది. ఇంద్రాణీ అరెస్టు తర్వాత ఆమె వస్తువుల కోసం కొందరు బంధువులు ఇంటికి వచ్చి గొడవ చేశారని విధి వివరించారు. విలువైన ఆభరణాలు, రూ.7 కోట్లు బ్యాంకు నిల్వలు దోచుకున్నారని ఆమె ఆరోపించారు.
ఇంద్రాణీ ముఖర్జియా, ఆమె మొదటి భర్త సిద్దార్థ్ దాస్లకు జన్మించిన సంతానం షీనా బోరా. 2012లో అమె అనుమానాస్పద రీతిలో అదృశ్యమైంది. షీనా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిందని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే 2015లో ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ ఓ కేసులో పోలీసులకు పట్టుబడటంతో.. షీనా హత్య కేసు వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa