ప్రభుత్వం ఉద్యోగం.. దాదాపు చదువుకున్న ప్రతి విద్యార్థి కల. గవర్నమెంట్ జాబ్ అంటే అదేదో అక్షయ పాత్ర అన్నట్లు భావిస్తారు చాలా మంది యువత. ఎప్పుడు తీసేస్తారో అనే భయం ఉండదు.. ఫస్టు తారీఖున కచ్చితంగా అకౌంట్లో జీతం పడుతుంది.. ప్రమోషన్ల గురించి ఎవరిని కాకా పట్టాల్సిన అవసరం లేదు.. వీటన్నింటికి తోడు సమాజంలో మంచి గౌరవం. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్లే చాలా మంది యువత ప్రభుత్వ కొలువు కోసం కలలు కంటారు. ఏళ్ల తరబడి రేయింబవళ్లు కష్టపడి చదువుతారు.
అయితే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందా అంటే రాదు. గవర్నమెంట్ కొలువు రావాలంటే కష్టంతో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. మరి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక్కొక్కళ్లు ఇంత కష్టపడుతుంటే.. ఓ యువతి మాత్రం గవర్నమెంట్ జాబ్కు ఓ దండం అంటూ రిజైన్ చేసింది. అందుకు ఆమె చెప్పిన కారణం వింటే కచ్చితంగా షాకవుతారు. ఆ వివరాలు..
ఢిల్లీకి చెందిన వాణి అనే 29 ఏళ్ల యువతి.. ఎంతో కష్టపడి.. బ్యాంకు కొలువు సాధించింది. నేటి కాలంలో బ్యాంక్ జాబ్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. వాణి కూడా ఏడాదంతా ఐబీపీఎస్ పరీక్షల కోసం ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఎంతో కష్టపడి చదివితే.. మూడేళ్ల క్రితం అనగా 2022లో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత స్కేల్ వన్ ఆఫీసర్గా ఆమెకు మీరట్లో పోస్టింగ్ వేశారు. లోన్ల విభాగంలో ఆమె పని చేసేది.
మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఉద్యోగంలో చేరిన మూడేళ్లకే రాజీనామా చేసింది. ఆమె నిర్ణయం ప్రతి ఒక్కరిని షాక్కు గురి చేసింది. ఇంత మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసుకుందనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. దీనిపై వాణి మాట్లాడుతూ.. ‘నేను బ్యాంక్ ఉద్యోగంలో చేరక ముందు ఎంతో సంతోషంగా, జాలీగా ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఉద్యోగంలో చేరిన ఈ మూడేళ్లలో నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఎంతలా అంటే నన్ను నేను అసహ్యించుకునే స్థాయికి చేరుకున్నారు. చిరాకు, విసుగు కలుగుతున్నాయి. అస్సలు మనశ్శాంతి లేకుండా పోయింది. వీటన్నింటికి కారణం జాబ్. అందుకే ఉద్యోగం మానేశాను. ఈ నిర్ణయం పట్ల నాకేం బాధ లేదు. చెప్పాలంటే ఇప్పుడే నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది.
వాణి మాట్లాడుతూ.. ‘మనది కానీ ప్రదేశాన్ని విడిచి పెట్టినప్పుడు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. నా నిర్ణయం గురించి నేనేం బాధపడటం లేదు. వాస్తవానికి ఇది నా డ్రీమ్ జాబ్.. దీని కోసం నేను చాలా కష్టపడ్డాను. కానీ వాస్తవం వేరేలా ఉంది. చాలా మంది దూరం నుంచే ఏం చూడకుండానే జడ్జ్ చేస్తుంటారు. అలాంటి వారి మాటలు పట్టించుకోకండి. ఇబ్బంది పడుతూ మనల్ని కష్టపెట్టుకుంటూ జీవించడం వల్ల ఎవరికి ఉపయోగం.. ధైర్యంగా నిర్ణయం తీసుకొండి’ అంటూ ఇన్స్టాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa