ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బైక్ పోగొట్టుకున్న వ్యక్తికి బంపరాఫర్ ఇచ్చిన రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 08:32 PM

కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ర్యాలీ కార్యక్రమంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఓట్లు చోరీ చేసిందని ఆరోపిస్తోన్న రాహుల్ గాంధీ .. ఈ అస్త్రంతోనే త్వరలోనే ఎన్నికలు నిర్వహించబోయే బిహార్‌లో రాహుల్ వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాహుల్ గాంధీ సభలకు జనాలు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా రాహుల్ గాంధీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన ఓ వ్యక్తి పాపం బైక్ పోగొట్టుకున్నాడు. విషయం కాస్త రాహుల్ గాంధీ దృష్టికి చేరడంతో.. అతడికి రాహుల్ గాంధీ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ వివరాలు..


వారం రోజుల క్రితం అనగా ఆగస్టు 27న రాహుల్ గాంధీ దర్భంగా ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శుభం అనే ధాబా ఓనర్ కూడా వచ్చాడు. అయితే వీరంతా రోడ్‌షో కార్యక్రమంలో బిజీగా ఉండగా.. సెక్యూరిటీ అధికారులు వచ్చి వారి బైక్‌లను తీసుకెళ్లారు. ఇలా తీసుకెళ్లిన బైకుల్లో శుభం బండి కూడా ఉంది. బైక్ పోవడంతో అతడు బాధపడ్డాడు. విషయం కాస్త రాహుల్ గాంధీకి తెలియడంతో ఆయన శుభం‌కి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. కొత్త పల్సర్ 220 బైక్‌ని శుభంకి గిఫ్ట్‌గా ఇచ్చి.. అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తారు రాహుల్ గాంధీ.


ఈ సందర్భంగా శుభం మాట్లాడుతూ.. ‘వాస్తవానికి ఆరోజు సెక్యూరిటీ సిబ్బంది నా ధాబా దగ్గర ఆగి ముందు టీ తాగారు. ఆ తర్వాత రోడ్‌షో కోసం కొన్ని బైక్‌లు కావల్సి ఉందని.. అందుకే నా బైక్ ఇవ్వమని కోరారు. పైగా పెద్దగా దూరం కూడా వెళ్లం. 1.5 కిలోమీటర్ వెళ్లి.. తిరిగి వెనక్కి వచ్చి నా బైక్ నాకు ఇస్తామని హామీ ఇచ్చారు’ అని చెప్పుకొచ్చాడు. వారు అంతటితో ఆగక.. ‘మా మాట మీద నమ్మకం లేకపోతే.. నా బైక్ మీదనే రోడ్‌షోకు వెళ్దామని అన్నారు. సరే అని నమ్మి నేను నా బండి మీద వారితో కలిసి బయల్దేరాను’ అని చెప్పుకొచ్చాుడు.


‘కాసేపటి తర్వాత వారు నన్ను బండి మీద నుంచి దింపి.. కారులో రావాల్సిందిగా చెప్పారు. సరే అని నేను రోడ్‌షో వద్దకు వెళ్లాను. కార్యక్రమం అయ్యాక నేను తిరిగి వచ్చాను. కానీ నా బండి తీసుకుని వెళ్లిన సెక్యూరిటీ వాళ్లు రాలేదు.. బైక్ కూడా రాలేదు’ అని తెలిపాడు. దీని గురించి శుభం మీడియాతో చెప్పడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న ఢిల్లీ కాంగ్రెస్ ఛీఫ్ దేవెందర్ యాదవ్ శుభంని కాంటాక్ట్ అయ్యి.. అతడిని పాట్నా రావాల్సిందిగా ఆహ్వానించారు.


యాత్ర మరొక రోజు ఉందనగా.. అనగా ఆగస్టు 31న శుభంకి ఒక కాల్ వచ్చింది. సెప్టెంబర్ 1న ఉదయం ఏడు గంటల వరకు పాట్న రావాల్సిందిగా సూచించారు. ఓటర్ అధికార్ యాత్ర కార్యక్రమం ముగింపు రోజున రాహుల్ గాంధీ శుభంని ప్రత్యేకంగా కలిశారు. అతడికి స్టేజ్ మీదనే కొత్త పల్సర్ 220 బైక్‌ని అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa