ప్రతీకార సుంకాల విధింపు నేపథ్యంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రష్యా వద్ద నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతీకారంగా ట్రంప్ భారత్ మీద 25 శాతం అధిక సుంకాలు విధించడంతో... ప్రస్తుతం ఇండియా మీద అమెరికా సుంకాలు 50 శాతానికి చేరాయి. అయితే ట్రంప్ బెదిరింపులకు మోదీ సర్కార్ ధీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం గురించి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో పీయూష్ గోయల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు...
అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం.. నవంబర్ కల్లా పూర్తవుతుందని తెలిపారు. అమెరికాతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం నవంబరు నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్తో వ్యాపార సంబంధాల పెంచుకోవడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. దీనిలో భాగంగానే.. యూరోపియన్ యూనియన్తో కూడా త్వరలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తవుతుందని చెప్పుకొచ్చారు.
టారిఫ్ల అంశం మీద అమెరికాతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు. అయితే, ఇండియా ఎప్పుడూ కూడా గడువు తేదీలు పెట్టుకుని చర్చలు జరపదని ఆయన స్పష్టం చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఎన్నడు కూడా డెడ్లైన్స్ పెట్టుకొని వాణిజ్య చర్చలు జరపదు. ఇరు వర్గాలకు ప్రయోజనకరంగా ఉండే ఒప్పందాలపై మాత్రమే చర్చిస్తుంది అని పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు. మన దేశం సరఫరా వ్యవస్థ చాలా బలంగా ఉందని.. మన ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
కాగా ఈ సంవత్సంర అనగా 2025లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ సుంకాల విధింపు నేపథ్యంలో.. మార్చి నుంచి భారత్, అమెరికా.. ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటివరకు 5 రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. ఆరో రౌండ్ చర్చల కోసం అమెరికా ప్రతినిధుల బృందం 2025, ఆగస్టు 25న ఇండియాకు రావాల్సి ఉంది. కానీ వారు రాలేదు. ఆగస్టు 27 నుంచి ఇండియా మీద 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఆరో దశ చర్చలకు ఇంకా కొత్త తేదీలను ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa