అత్యాచారానికి గురైన 15 ఏళ్ల బాలికను నిందితుడి ఇంటికే స్వయంగా అధికారులు పంపడంతో అక్కడ ఆమెపై మళ్లీ లైంగిక దాడి జరిగింది. విస్మయానికి గురిచేసే ఘటన మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు సహా పది మందిపై కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. పన్నా జిల్లా ఛత్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక (15) ఈ ఏడాది జనవరి 16న స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కలా గాలించి, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి.. బాలిక కోసం గాలించారు. నెల రోజుల తర్వాత బాలిక గురుగ్రామ్లో ఓ వ్యక్తితో ఉన్నట్టు తేలిసి.. ఫిబ్రవరి 17న అక్కడ నుంచి తీసుకొచ్చారు. పొరుగున ఉండే గ్రామానికి చెందిన ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. అతడ్ని అరెస్ట్ చేసి, జైలుకు పంపారు.
పన్నా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును.. జుఝార్కు బదిలీ చేశారు. బాధితురాలిని పునరావాసం కోసం పన్నా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి.. పన్నాలోని వన్ స్టాప్ సెంటర్ (OSC)లో ఉంచారు. అయితే, కమిటీ నిబంధనలకు ఉల్లంఘించి నిందితుడి వదిన ఇంటికి పంపారు. ఆమె కూడా బాధిత బాలికకు బంధువే కావడం గమనార్హం. నిందితుడు బెయిల్పై జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ ఇంటికి వెళ్లి మైనర్పై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతడ్ని మళ్లీ అరెస్ట్ చేశారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు బాలిక సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సింది పోయి నిందితుడికి అనుకూలంగా వ్యవహరించినట్టు దర్యాప్తులో తేలింది. వారి నిర్వాకంతో బాలికపై పలుసార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇక, తమ కుమార్తెను అప్పగించాలని బాధిత కుటుంబం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఆయన జోక్యం చేసుకుని, ఆదేశాలను సమీక్షించాలని సీడబ్ల్యూసీని ఆదేశించారు. అయితే, తమ తప్పును కప్పిపుచ్చడానికి, అధికారులు ఏప్రిల్ 29, 2025న బాలికను తిరిగి OSCకి తరలించినట్లు సమాచారం. అక్కడ కౌన్సెలింగ్ సమయంలోనే దారుణం వెలుగులోకి వచ్చింది.
అయినప్పటికీ అధికారులు చట్టం ప్రకారం నేరాన్ని బయటకు రాకుండా అణిచివేశారు. కానీ, మీడియా ద్వారా ఈ ఘోరం వెలుగులోకి రావడంతో ఛత్రపూర్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఏఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు సాగిందని, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని ఒ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వారిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు పేర్కొన్నారు. బాలల సంరక్షణ కమిటీ ఛైర్మన్, సభ్యులు, అధికారులు సహా పది మందిని నిందితులుగా చేర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa