ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫ్గనిస్థాన్ భూకంప బాదితులకు భారత్ సాయం.. కనీసం మానవత్వం లేకుండా అడ్డుకున్న పాక్

national |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 08:19 PM

ఇటీవల ఆఫ్గనిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఈ భూకంపంలో 800 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. భూకంప బాధిత దేశాన్ని ఆదుకోడానికి భారత్ పెద్ద మనసుతో ముందుకొచ్చింది. అత్యవసర సాయం కింద టెంట్లు, దుప్పట్లు, ఔషధాలు, బియ్యం, గోధుమలను వాహనాల్లో పంపింది. పాకిస్థాన్ మీదుగా అఫ్గన్‌కు ఈ వాహానాలు చేరుకోవాల్సి ఉంది. అయితే, కనీసం మానవత్వం లేకుండా భారత వాహనాలను తమ దేశం గుండా వెళ్లేందుకు దాయాది అనుమతి నిరాకరించింది. కాగా, అఫ్గనిస్థాన్‌, భారత్ మధ్య శతాబ్దాలుగా అనుబంధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.


పాకిస్థాన్ సాధారణ రోడ్డు మార్గాలను మూసివేయడంతో భారత్ వాయు మార్గంలో వీటిని అఫ్గనిస్థాన్‌కు చేరవేసింది. కామ్ ఎయిర్‌తో కలిసి సహాయాన్ని అందించింది. మొదటి విడతలో 1,000 టెంట్లు, 15 టన్నుల ఆహారాన్ని పంపింది. రెండో విడతలో 21 టన్నుల సహాయ సామగ్రి పంపడానికి సిద్ధమైంది. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ, విపత్తులో సర్వం కోల్పోయిన ఆఫ్గన్ ప్రజలకు మరింత సహాయం అందజేస్తామని భారత్ ప్రకటించింది. భూకంపం తర్వాత అఫ్గనిస్థాన్‌కు భారత్ అందించే సహాయ కార్యక్రమాల కోసం రోడ్డు మార్గాన్ని పాకిస్థాన్ మూసివేయడంతో టన్నుల కొద్దీ సహాయాన్ని విమానంలో పంపించింది.


కానీ, బాధితులకు మరింత వేగంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో భారత్ ఎయిర్‌లిఫ్ట్ చేస్తోంది. పాక్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూకంపంతో సర్వం కోల్పోయి నిరాశ్రయులను ఆదుకోడానికి భారత్ ముందుకొస్తే.. మానవతా సాయం కూడా అందకుండా పాక్ అడ్డుకుంటోందని మండిపడుతున్నారు. ఇది ఆధునిక ప్రపంచానికి సిగ్గుచేటని, అయినా భారత్ సాయం మాత్రం ఆగదని పలువురు ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా, అఫ్గన్‌కు సాయంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ... కాబుల్ నుంచి కునార్ వరకు ఆహారం, టెంట్లు అందజేసినట్లు తెలిపారు. తాలిబన్ విదేశాంగ మంత్రి మావ్‌లావీ అమీర్ఖాన్ ముత్తఖితో మాట్లాడిన ఆయ.. సహాయక చర్యలకు సంబంధించి సామాగ్రి పంపేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. న్యూఢిల్లీ నుంచి కాబూల్ విమానాశ్రయానికి విమానాల్లో భారత్ రిలీఫ్ మెటీరియల్ పంపింది.


అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం.. ఆగస్టు 31 రాత్రి 11.47 గంటలకు ఆఫ్గనిస్థాన్‌లోని నంగర్హార్‌ ప్రావిన్సు జలాలాబాద్‌ సమీపంలో 20 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. తొలుత రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భారీ భూకంపం నమోదుకాగా... భూకంప కేంద్రం 8 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు తెలిపింది. 20 నిమిషాల తర్వాత 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa