బిహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లా జైలు వివాహ వేదికగా మారింది. జైల్లో ఉన్న ఓ ఖైదీ.. అత్యాచార బాధితురాలిని వివాహం చేసుకున్నాడు. జైలు సిబ్బంది వీరి పెళ్లికి పెద్దలుగా వ్యవహరించగా.. తోటి ఖైదీలు.. బంధుమిత్రులుగా మారారు. జైల్లో ఉన్న వ్యక్తి అత్యాచార బాధితురాలిని చేసుకున్నాడంటే అతడిలో ఏ స్థాయిలో మార్పు వచ్చిందో అని సంబరపడకండి. ఎందుకంటే ఆ ఖైదీ వివాహం చేసుకుంది.. స్వయంగా అతడి మీద అత్యాచార ఆరోపణలు చేసిన మహిళనే. మరో వింత ఏంటంటే.. ఆమె అతడికి స్వయానా వదిన అవుతుంది. ఈ వింత పెళ్లి వివరాలు మరింత ఆశ్చర్యపరుస్తాయి. జైలు అధికారులు దగ్గరుండి మరీ ఈ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. సిబ్బంది ఈ పెళ్లికి సాక్షులుగా ఉన్నారు. మిగతా ఖైదీలు బంధు, మిత్రుల పాత్ర పోషించారు
ఈక్రమంలో నిందితుడి తరఫు న్యాయవాది గగన్ దేవ్ యాదవ్ మాట్లాడుతూ.. ఆసక్తికర అంశాలు వెల్లడించారు. నిందితుడి అన్న 2022లో మరణించాడు. ఆ తర్వాత నిందితుడి అన్న భార్య.. అనగా అతడి వదిన నిందితుడితో కలిసి ఉండటం మొదలు పెట్టింది. ఇద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు. అయితే కొంత కాలం తర్వాత నిందితుడు, అతడి వదిన మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో ఆమె 2024 జూన్ 29న.. నిందితుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు మహిళా పోలీస్ స్టేషన్లో నమోదయింది. మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
ఆ తరువాత అతను బెయిల్ కోసం పాట్నా హైకోర్టుకు వెళ్ళాడు. అయితే కోర్టు ఒక విచిత్రమైన కండిషన్ పెట్టింది. పెళ్లి చేసుకున్న తర్వాత, ఆ విషయాన్ని దిగువ కోర్టు ధృవీకరించాలని ఆదేశించింది. దీంతో నిందితుడు పెళ్లి చేసుకోవడానికి అనుమతి కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టు అందుకు ఆమోదం తెలపడంతో.. జైలులోనే వారి పెళ్లి జరిగింది. ఇది చాలా అరుదైన సంఘటన అని చెప్పవచ్చు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారమే జైలు ఆవరణలో పెళ్లి జరిపించాము అని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. అంతేకాక పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ తామే చేశామని తెలిపారు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అనగా మంగళవారం జైల్లోనే అధికారులు ఖైదీ వివాహానికి ఏర్పాట్లు చేశారు. జైలు సిబ్బంది.. తోటి ఖైదీల మధ్య వివాహం జరిపించారు. కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో.. ఆ మేరకు జైలు యంత్రాంగం ఈ వేడుకకు ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. బంధువులకు బదులుగా జైలు సిబ్బంది, తోటి ఖైదీలు సాక్షుల పాత్ర పోషించారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశానుసారం వివాహం జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ఓం ప్రకాష్ శాంతి భూషణ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa