ముంబయికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. 34 వాహనాల్లో మానవబాంబులు (Human Bombs) నగరంలోకి ప్రవేశించాయని పేర్కొంటూ శుక్రవారం ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు బెదిరింపు సందేశం వచ్చింది. ‘‘ముంబయిలోకి 14 మంది పాక్ ఉగ్రవాదులు (Terror threat) చొరబడ్డారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 34 వాహనాల్లో మానవబాంబులను ఏర్పాటు చేశాం. వారి వద్ద 400 కిలోల ఆర్డీఎక్స్ (RDX) ఉంది. ఇప్పుడు మేము చేపడుతున్న భారీ పేలుళ్లు మొత్తం ముంబయి నగరాన్ని కుదిపేస్తాయి’’ అని మెయిల్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ‘లష్కర్ ఏ జిహాదీ’ అనే ఖాతా నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు వెల్లడించారు. తాను పాక్కు చెందిన జిహాదీ గ్రూప్ సభ్యుడిగా మెయిల్ పంపిన వ్యక్తి పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు హైఅలర్ట్ (High Alert) ప్రకటించారు. నగరంలో భారీగా భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదన్నారు. నగరంలో అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ముంబయి పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa