విజయవాడ దుర్గమ్మ భక్తులకు తీపికబురు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు విజయవాడ దుర్గ గుడి దేవస్థానం కీలక చర్యలు తీసుకుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో శుక్రవారం రెండు కొత్త ఆర్వో తాగునీటి ప్లాంట్లను ప్రారంభించింది. రూ. 30 లక్షల వ్యయంతో ఈ రెండు ఆర్వో తాగునీటి ప్లాంట్లను నిర్మించారు. వీటి నిర్మాణం కోసం దివీస్ లాబొరేటరీస్ నిధులు సమకూర్చింది. ఈ ప్లాంట్లను అడ్డాల మండపం, కొత్త పూజ మండపం వద్ద ఏర్పాటు చేశారు. దుర్గ గుడి ఈవో వీకే సీనా నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి.. రెండు ఆర్ఓ తాగునీటి ప్లాంట్లను శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన దుర్గ గుడి ఈవో శీనా నాయక్.. దివిస్ లాబొరేటరీస్ మొత్తం రూ. 80 లక్షల వ్యయంతో ఐదు ఆర్ఓ తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందని వివరించారు. వీటిలో రెండు జల ప్రసాద కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామని, మరో రెండు జల ప్రసాద కేంద్రాలను ఇవాళ (శుక్రవారం) ప్రారంభించామని చెప్పారు. ఐదవ జల ప్రసాదం కేంద్రం ఏర్పాటు కోసం అవసరమైన భూమిని ఆలయ యాజమాన్యం ఖరారు చేసిందని, ఇది త్వరలో ఆలయంలో భక్తులకు అందుబాటులోకి వస్తుందని దుర్గ గుడిఈవో శీనా నాయక్ చెప్పుకొచ్చారు.
చంద్రగ్రహణం దుర్గ గుడి మూసివేత
మరోవైపు చంద్రగ్రహణం సందర్భంగా బెజవాడ దుర్గ గుడిని మూసివేయనున్నారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా.. ఇంద్రకీలాద్రిపై ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలన్నింటినీ మూసివేస్తున్నట్లు తెలిపారు.
7వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆగస్ట్ 8వ తేదీ ( సోమవారం) ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకూ ప్రధాన ఆలయం, ఇతర ఉపఆలయాలు మూసివేస్తున్నట్లు ఈవో వీకే సీనా నాయక్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కవాట బంధనంతో ఆలయ ద్వారాలు మూసివేస్తామని వెల్లడించారు. సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయని భక్తులు సహకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa