ఏపీ లిక్కర్ కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్ పోర్టులు అప్పగించాలని.. ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ధనుంజయ రెడ్డి ఏ31గా ఉండగా.. కృష్ణ మోహన్ రెడ్డి ఏ-32గా, బాలాజీ గోవిందప్ప ఏ-33గా ఉన్నారు. ఈ ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్ విచారించిన ఏసీబీ కోర్టు ఇటీవల వాదనలు పూర్తి చేసింది. శనివారం ముగ్గురికీ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకూ 12 మంది అరెస్ట్ అయ్యారు. మరోవైపు ఏసీబీ కోర్టు ఇప్పటి వరకూ నలుగురికి బెయిల్ మంజూరు చేసింది.
ఏపీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ రెడ్డి , కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో బాలాజీ గోవిందప్పను మే 13న, ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డిని మే 16న ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి వారు రిమాండ్లో ఉన్నారు. తాజాగా శనివారం రోజున ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రేపు (ఆదివారం) వీరు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై కూడా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఇటీవల అరెస్ట్ కూడా చేశారు. అయితే తాజాగా మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఎన్నిక పూర్తైన అనంతరం సెప్టెంబర్11న తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కావాలని మిథున్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. రూ.50 వేల చొప్పున 2 పూచీకత్తులతో ష్యూరిటీ సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదలయ్యారు.మరోవైపు సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహిస్తున్నారు. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. వైసీపీ ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తిరిగి జైల్లో సరెండర్ కావాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa