ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్‌‌లో హింసాత్మకంగా ఆందోళనలు.. 14 మంది మృతి, మరో 100 మందికిపైగా గాయాలు

international |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 08:48 PM

అవినీతి, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్‌లో యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి, పార్లమెంట్ సమీపంలోని నిషేధిత ప్రాంతాల్లోకి ఆందోళనకారులు చొరబడటంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వాటర్ బాటిల్స్, రాళ్లు రువ్వుతోన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటార్ క్యానన్లు, టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లును ప్రయోగించారు. వాటిని లెక్కచేయకుండా కొందరు పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడంతో పరిస్థితి అదుపుతప్పింది. గతేడాది ఆగస్టులో టిక్‌టాక్‌పై విధించిన నిషేధాన్ని ఇటీవలే నేపాల్ తొలగించింది. కానీ, అమెరికా యాప్‌లపై నిషేధం విధించడంతో యువత రగిలిపోతోంది.


నేపాల్ రాజధాని కాఠ్మాండూలోని బనేశ్వర్ ఏరియాలో అధికారులు తొలుత కర్ఫ్యూ విధించారు. అయితే, ఆందోళనలు ఉద్ధృతం కావడంతో లైయిచౌర్‌లోని అధ్యక్ష భవనం (శీతల్ నివాస్), వైస్-ప్రెసిడెంట్ నివాసం, మహారాజ్‌గంజ్‌, సింఘా దర్బార్, బలూవతార్‌లోని ప్రధాని నివాసం సహా అనేక హై-సెక్యూరిటీ జోన్లలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చాబిలాల్ రిజాల్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో జనాలు గుమిగూడటం, ఆందోళనలు, సమావేశాలు, ముట్టడి కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు.


జనసమూహాన్ని నియంత్రించడానికి పోలీసులు ప్రయోగించిన రబ్బరు బుల్లెట్ కారణంగా ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. కాఠ్మాండూలో కాంతిపూర్ టెలివిజన్ జర్నలిస్ట్ శ్యామ్ శ్రేష్ఠ బనేశ్వర్‌లో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు రబ్బరు బుల్లెట్ తగిలింది. ప్రస్తుతం ఆయన సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే, నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి స్వస్థలమైన డమాక్‌లో నిరసనలు హింసాత్మకంగా మారి మరొక వ్యక్తి గాయపడ్డాడు. తొలుత కాఠ్మాండూకు పరిమితమైన నిరసనలు.. క్రమంగా నేపాల్‌లో అనేక ప్రాంతాలకు పాకాయి. పోఖారాలో ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడి అనంతరం స్థానిక అధికారులు కర్ఫ్యూ విధించారు.


ఆందోళనలు తీవ్రతరం కావడంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ.. అత్యవసర క్యాబినెట్ సమావేశానికి పిలుపునిచ్చారు. నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించడంతో గత శుక్రవారం నుంచి ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ వంటి 26 సోషల్ మీడియా సైట్లు యూజర్లకు అందుబాటులో లేవు. ఇది యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. దీంతో పాటు ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి వేళ్లూనుకుపోవడంతో మరింత ఆగ్రహించిన యువత.. వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ భవనం ముట్టడికి ప్రయత్నించారు. కేవలం తమ పోరాటం సోషల్ మీడియాపై బ్యాన్‌కు పరిమితం కాదని, దేశంలో అవినీతి ఎక్కువైపోయిందని అంటున్నారు. దీనిని మా పెద్దలు సహించినా.. మా తరం నుంచైనా మార్పు రావాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa