ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 15 నుంచి యూపీఐ కొత్త రూల్స్.. ఇక రోజుకు రూ.10 లక్షలు

business |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 10:26 PM

దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) దూసుకెళ్తోంది. మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటానే 80 శాతం వరకు ఉంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నారు. ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తూ వస్తోంది. యూజర్ల భద్రతకు భరోసా కల్పిస్తూ ట్రాన్సాక్షన్ లిమిట్ సైతం పెంచుతోంది. మరోసారి యూపీఐలో కొత్త మార్పులు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎంపిక చేసిన వర్గాలకు ట్రాన్సాక్షన్ పరిమితులను పెంచుతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారు, పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేసే వారికి ఈ కొత్త రూల్స్ ఉపయోగపడనున్నాయి. సెప్టెంబర్ 15, 2025 నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి తీసుకురానున్నారు.


యూపీఐ కొత్త రూల్స్ ప్రకారం.. ఒక యూజర్ 24 గంటల్లో (ఒక్క రోజులో) రూ.10 లక్షల వరకు ట్రాన్సాక్షన్ చేయవచ్చు. అయితే, ప్రత్యేక ధ్రువీకరణ పొందిన వారు, వ్యాపారులకు ఇది వర్తిస్తుంది. అయితే, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ల పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం వారు రోజుకు రూ.1 లక్ష వరకు పంపించవచ్చు. ఆ లిమిట్‌లో ఎలాంటి మార్పులు లేవని గమనించాలి. ఎంపిక చేసిన వారికి మాత్రమే రూ.10 లక్షల వరకు అవకాశం కల్పిస్తున్నారు.


క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల వంటి వాటి కోసం అయితే యూపీఐ లిమిట్ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నారు. 24 గంటల్లో గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు అనుమతిస్తారు. ఇక ట్రావెలింగ్ సెక్టార్‌లో ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. రోజులో గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు అవకాశం ఉంటుంది. మరోవైపు.. క్రెడిట్ కార్డుల బిల్లుల కోసం అయితే ఒకేసారి రూ.5 లక్షల వరకు చేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే, రోజు వారీ లిమిట్ రూ.6 లక్షలు ఉంటుంది.


రుణాల ఈఎంఐల చెల్లింపుల పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. అయితే ఒక రోజులో గరిష్ఠంగా రూ.10 లక్షలే పంపించవచ్చు. బంగారం, వెండి, డైమండ్ ఆభరణాల కొనుగోళ్ల కోసం రూ.1 లక్షగా ఉన్న పరిమితిని రూ.2 లక్షలకు పెంచారు. అయితే, ఒక రోజులో గరిష్ఠంగా రూ.6 లక్షల వరకే అనుమతి ఉంటుంది. ఇగ బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ విధానం ద్వారా టర్మ్ డిపాజిట్లలో ఒక రోజుకు రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇప్పటి వరకు ఈ పరిమితి రూ.2 లక్షలుగా ఉండగా దానిని రూ.5 లక్షలకు పెంచారు. ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచుతూనే రోజు వారీ గరిష్ఠ పేమెంట్ల పరిమితులు విధించింది ఎన్‌పీసీఐ. పెరిగిపోతున్న సైబర్ మోసాల నుంచి యూపీఐ యూజర్లను రక్షించేందుకు ఈ మేరకు రోజు వారీ గరిష్ఠ లిమిట్ పెట్టినట్లు తెలుస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa