ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆ బెనిఫిట్స్ ఏం లేవ్'.. జీఎస్టీ తగ్గింపుపై బాంబు పేల్చిన ట్యాక్స్ విభాగం

business |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 10:28 PM

 వస్తు సేవల పన్ను జీఎస్టీలో మార్పులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. జీఎస్టీ 2.0లో కేవలం రెండు పన్ను శ్లాబులు 5, 18 శాతం ఉంటాయి. 12, 28 శ్లాబులను తొలగించారు. దీంతో చాలా రకాల వస్తువులు, సేవలపై పన్నుల భారం తగ్గి ప్రజలకు ప్రయోజనాలు అందనున్నాయి. ఈ క్రమంలోనే జీఎస్టీ కొత్త రూల్స్ గురించి చాలా రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ వైరల్ పోస్టుపై కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోకి వస్తోన్న జీఎస్టీ కొత్త రూల్స్ కింద కొత్త ట్రాన్సిషన్ బెనిఫిట్స్ ఉంటాయన్న ప్రచారాన్ని ఖండించింది. అలాంటి బెనిఫిట్స్ ఏం లేవని తేల్చేసింది. ఈ మేరకు ఆ ప్రకటన జారీ చేసింది.


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ విభాగం (సీబీఐసీ) ఛైర్మన్ ఓ ప్రకటన చేశారంటూ సోషల్ మీడియాలో జీఎస్టీ బెనిఫిట్స్‌కి సంబంధించి ఓ పోస్ట్ సర్క్యూలేట్ అవుతోంది. జీఎస్టీ మార్పుల ద్వారా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయని, ప్రధానంగా యుటిలైజ్డ్ సెస్ క్రెడిట్, మినహాయింపు ఉన్న సరఫరాల ఐటీసీ వంటివి ఉంటాయని ఆ పోస్టులో రాసుకొచ్చినట్లు సీబీఐసీ తెలిపింది. సెప్టెంబర్ 22, 2025 నుంచి ఈ కొత్త ధరల సవరణ అమలులోకి తెస్తున్నట్లు సీబీఐసీ ఛైర్మన్ జారీ చేసినట్లు పోస్ట్ పేర్కొందని, అది తప్పుడు ప్రచారమని స్పష్టం చేసింది. అలాంటి ప్రచారాలు తప్పుడు, తప్పుదారి పట్టించేవి అని తెలిపింది.


 సీబీఐసీ ప్రకటన ప్రకారం.. ' జీఎస్టీ మార్పుల ద్వారా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయంటూ సీబీఐసీ ఛైర్మన్ జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ పోస్టు మా దృష్టికి వచ్చింది. అన్‌యుటిలైజ్డ్ సెస్ క్రెడిట్, ఎగ్జెంప్టెడ్ సప్లాయిస్ ఐటీసీ, కొత్త ధరల సవరణ బెనిఫిట్స్ వంటివి అందులో క్లెయిమ్ చేశారు. అటువంటి వాదనలు వాస్తవంగా తప్పు, తప్పుదారి పట్టించేవని తెలియజేస్తున్నాం' అని పేర్కొంది. దేశ ప్రజలు, ట్రేడ్ యూనియ్లు, ఇండస్ట్రీ కమ్యూనిటీల సభ్యులు, ఇతర భాగస్వామ్యులు ఇలాంటి వాటిని నమ్మవద్దని సూచించింది. ప్రభుత్వం అధికారికంగా జారీ చేసే నోటిఫికేషన్లు, సర్క్యూలర్లు, ఎఫ్ఏక్యూలను మాత్రమే చూడాలని కోరింది. దాని ద్వారానే తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకోవాలని స్పష్టం చేసింది.


సెప్టెంబర్ 3వ తేదీన జరిగిన జీఎస్టీ 56వ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ సంస్కరణలకు ఆమోదం లభించింది. దీంతో దేశంలో రెండు శ్లాబుల వ్యవస్థ అమలు కాబోతోంది. 5, 18 శాతం మాత్రమే జీఎస్టీ శ్లాబులు ఉంటాయి. అయితే, సైన్ గూడ్స్, లగ్జరీ వస్తువులకు సంబంధించి 40 శాతం ట్యాక్స్ శ్లాబ్ తీసుకొస్తున్నారు. వాటి ధరలు అమాంతం పెరుగుతాయి. కానీ, చాలా వరకు నిత్యావసర వస్తువుల ధరలు దిగివస్తాయని చెప్పవచ్చు. 12, 28 శాతం శ్లాబులను పూర్తిగా తొలగించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa