ప్రస్తుతం నేపాల్లో యువత హింసాత్మక నిరసనలు, గతేడాది బంగ్లాదేశ్లో జరిగిన ఆందోళనల గురించి సర్వోన్నత న్యాయస్థానం ప్రస్తావించింది. బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించడంపై వివరణ కొరుతూ ద్రౌపది ముర్ము లేవనెత్తిన అంశాలపై బుధవారం (సెప్టెంబరు 10) నాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందించింది. భారత రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజా ప్రాముఖ్యత లేదా ప్రజలపై ప్రభావం చూపే ఏదైనా న్యాయపరమైన అంశం విషయంలో రాష్ట్రపతి సుప్రీం కోర్టు సలహా కోరే హక్కు కలిగి ఉంటారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు. మన రాజ్యాంగంపై మాకు గర్వం ఉందని పేర్కొన్నారు.
‘నేపాల్ సహా మన పొరుగు దేశాల్లో ఏం జరిగిందో చూస్తున్నాం... ’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత 48 గంటల కిందట ప్రారంభించిన జన్ జీ ఆందోళనల్లో కనీసం 25 మంది ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా ధర్మాసనంలో మరో న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ ..‘అవును.. బంగ్లాదేశ్లోనూ ఇదే జరిగింది’ అని అన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ గతేడాది బంగ్లాదేశ్ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆందోళనల్లో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంతో హసీనా తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసి, దేశం విడిచి భారత్కు వచ్చి రక్షణ పొందారు. అక్కడ ఏడాది నుంచి మహ్మద్ యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వం కొనసాగుతోంది.
నేపాల్, గతేడాది బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలకు సారూప్యతలు ఉన్నాయి. రాజ్యాంగం, చట్ట పాలన పూర్తిగా విచ్ఛిన్నం కావడం అనే పెద్ద అంశం కూడా ఇందులో ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్ల తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. గవర్నర్లు ప్రభుత్వం ఆమోదించి పంపే బిల్లులను నెలల తరబడి రిజర్వ్లో ఉంచే అంశాన్ని సమర్థించుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది.
జస్టిస్ నాథ్ వ్యాఖ్యానిస్తూ.. ‘గత 75 ఏళ్లుగా ఎన్ని బిల్లులు ఆమోదించబడ్డాయో, ఎన్ని నిలిపివేయబడ్డాయో సంబంధం లేకుండా దేశం నడుస్తూనే ఉంది’ అని అన్నారు. దీనికి స్పందించిన మెహతా, ఇలాంటి పరిణామం చాలా అరుదుగా జరిగిందని తన వద్ద గణాంకాలు ఉన్నాయని తెలిపారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి ఈ వాదనను తిరస్కరించారు. ‘‘మేము గణాంకాలను పరిగణనలోకి తీసుకోలేం... అది వారికి (గవర్నర్లకు వ్యతిరేకంగా వాదిస్తున్న రాష్ట్రాలకు) న్యాయం కాదు. వారి గణాంకాలను మేము తీసుకోలేదు.. మరి మీవాటిని ఎలా తీసుకుంటాం? మేము ఆ విషయానికి వెళ్లం... మీరు ముందే వారి గణాంకాలకు అభ్యంతరం చెప్పారు కదా?’’ అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa