అంగన్వాడీ కేంద్రాలకు చెందిన గుడ్లను అక్రమంగా ఒక వైన్ షాప్ పక్కన ఉన్న సిట్టింగ్ షాపులో అమ్మిన ఘటనపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కఠినంగా స్పందించారు.ఈ ఘటనలో బాధ్యత వహించిన రంగాపూర్ అంగన్వాడీ-1 టీచర్ రాజమ్మను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ సంఘటనకు సంబంధించి మరికొందరు అధికారులు కూడా చర్యలకు గురయ్యారు. గత వారం రోజుల క్రితం హుజురాబాద్ పట్టణంలో ఈ అక్రమ గుడ్ల విక్రయం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కేంద్రాల నుంచి రావాల్సిన గుడ్లను వైన్ షాప్ పక్కన ఉన్న సిట్టింగ్ షాపులో మద్యం తాగే వ్యక్తులకు అమ్ముతున్నట్లు మీడియా కథనాలు తెలిపారు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీల పోషకాహార అవసరాలకు ప్రభుత్వం సరఫరా చేసే ఈ గుడ్లను ఇలా అక్రమంగా విక్రయించడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కథనాల వెలుగులోకి రావడంతో, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఫోరువై విచారణకు ఆదేశించారు. ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి వెంటనే రంగంలోకి వచ్చి పూర్తి విచారణ చేపట్టారు. విచారణలో అంగన్వాడీ టీచర్ రాజమ్మ గుడ్లను వైన్ షాపుకు విక్రయించినట్లు తేలింది.విచారణ నివేదికను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి, ఈ సంఘటనను అత్యంత సీరియస్గా పరిగణించారు. అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం పేదలకు పోషకాహారం అందించడం కాగా, వాటిని అక్రమంగా వ్యాపారాలలో వినియోగించడం తీవ్ర నేరమని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, రాజమ్మను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించారు.అంతేకాక, పర్యవేక్షణలో నిర్లక్ష్యం చూపిన సూపర్వైజర్ శిరీషకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. పూర్తి స్థాయి పర్యవేక్షణలో విఫలమైన సీడీపీఓ మరాఠీ సుగుణకు కూడా మెమో అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa