ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. రానున్న 3 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లాతోపాటు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అదే సమయంలో ఏలూరు జిల్లాతోపాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు.. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అది త్వరలోనే అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోనూ అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపిన రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చెట్ల కింద, హోర్డింగుల వద్ద నిలబడకూడదని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.
మరోవైపు.. ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. దక్షిణ కోస్తా ప్రాంతంలో కొన్నిచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలోనే కోస్తాంధ్ర మొత్తం ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బ్యారేజ్కి దిగువన ఉన్న వారధి వద్ద ముందస్తు చర్యల్లో భాగంగా 3 వేల ఇసుక బస్తాలను అధికారులు మోహరించారు. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం బ్యారేజ్లోకి 6.55 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. 6.39 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇఖ.. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ప్రకటించారు. 10.20 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa