భారీ పేలుళ్లతో మరోసారి పాకిస్థాన్ దద్దరిల్లింది. పాక్ సైనిక కార్యాలయం ముందు కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పాక్ ఆరోగ్య శాఖ మంత్రి బక్త్ ముహమ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. క్వెట్టా సమీపంలో జరిగిన ఈ పేలుడు శబ్ధం కొన్ని కిలో మీటర్ల మేర వినిపించిదని స్థానికులు తెలిపారు. బాంబు పేలుడు ధాటికి సమీపంలోని నివాస సముదాయాలు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్వెట్టా నగరంలోని జర్ఘూన్ రోడ్డులో పాకిస్థాన్ ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్సీ) పారా మిలిటరీ కేంద్ర కార్యాలయం ముందుకి ఒక్కసారిగా ఓ కారు దూసుకొచ్చింది. అనంతరం ఎఫ్సీ కార్యాలయం ముందుకు రాగానే భారీ పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడుతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. అయితే ఇది ఆత్మాహుతి దాడి అని పాకిస్థాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
పేలుడు జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సమీప ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి. అనంతరం సమీప ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని ఎమర్జెన్సీ డ్యూటీలో ఉంచారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఏ గ్రూప్ బాధ్యత తీసుకోలేదు. అయితే బలూచిస్తాన్ వేర్పాటువాద శక్తులే ఈ దాడికి పాల్పడినట్లు ప్రభుత్వం ఆనుమానం వ్యక్తం చేస్తోంది.
ఇటీవల (సెప్టెంబర్ 24) క్వెట్టా వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్పై బాంబు గాడి జరిగింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా దాదాపు 12 మంది చనిపోయారు. అంతకుముందు (సెప్టెంబర్ 3) బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన క్వెట్టాలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. బలోచిస్తాన్ నేషనల్ పార్టీ ర్యాలీ జరిగిన ప్రదేశంలో జరిగిన ఈ పేలుడు ధాటికి.. దాదాపు 15 మందికి మృతిచెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది.
ప్రత్యేక దేశం కోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏళ్లుగా సాయుధ పోరాటం చేస్తోంది. తమ వాదాన్ని వినిపించడానికి, ఉనికిని చాటుకోవడానికి తరచుగా రైల్వేస్టేషన్లు, పైపులైన్లు, భద్రతా బలగాల కార్యాలయాలు, చైనా చేపట్టిన ప్రాజెక్టులు లక్ష్యంగా దాడులు చేస్తోంది. పాకిస్థాన్లో బాంబు పేళుళ్లకు బీఎల్ఏ ఒక కారణం. మరోవైపు, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ), ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ వంటి మిలిటెంట్ సంస్థలు.. తమపై ఆర్మీ చేస్తున్న ఆపరేషన్లకు వ్యతిరేకంగా, తమ ఉనికిని చాటుకోవడానికి తరచుగా ఆత్మాహుతి దాడులు, బాంబు పేలుళ్లకు పాల్పడతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa