ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్విట్జర్లాండ్‌లో రుద్రాక్షలకు భారీగా డిమాండ్

international |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 08:50 PM

రుద్రాక్షలు అంటే ఒకప్పుడు మన దేశంలో కేవలం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవాళ్లు ఎక్కువగా వినియోగించేవారు. భారతీయుల్లో కేవలం ఆధ్యాత్మిక వినియోగానికే పరిమితమైన రుద్రాక్షలు.. ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో బాగా పాపులర్ అవుతున్నాయి. స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల నుంచే కాకుండా.. స్థానికులు కూడా వీటికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్ క్రైస్తవ దేశం అయినప్పటికీ.. ఇప్పుడు అక్కడ రుద్రాక్షలు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో స్విట్జర్లాండ్‌లో రుద్రాక్షలకు ప్రజాదరణ పెరుగుతోంది. యోగా, ఆరోగ్యం కోసం ఈ రుద్రాక్షలను కొనుగోలు చేస్తున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.


రుద్రాక్షలను కేవలం మతపరమైన వినియోగానికి మాత్రమే పరిమితం కాకుండా.. లౌకిక ఆధ్యాత్మికతకు ఒక రూపంగా, ఆధునిక వెల్‌నెస్ కోసం స్విట్జర్లాండ్‌ ప్రజలు చూస్తున్నారు. అందుకే అక్కడి ఆన్‌లైన్ యోగా దుకాణాలు, రిటైలర్లు రుద్రాక్షలను 50 స్విస్ ఫ్రాంక్‌లు (అంటే భారత కరెన్సీలో సుమారు రూ.4,650) ధరకు అమ్ముతున్నారు. ఈ రుద్రాక్షలను పూజా సాధనాలుగా మాత్రమే కాకుండా శరీరాన్ని, మానసిక ప్రశాంతతను అందించే సాధనంగా ప్రచారం చేస్తుండటంతో వీటికి బాగా డిమాండ్ పెరుగుతోంది. భారత్–యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ) మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కారణంగా ఈ రుద్రాక్షల బిజినెస్ కూడా మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఈ ఒప్పందం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. 2024-2025లో దాదాపు 97 లక్షల విలువైన రుద్రాక్షలను స్విట్జర్లాండ్ సహా ఇతర దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. స్విట్జర్లాండ్‌లో 27 వేల కంటే ఎక్కువ మంది భారతీయులు, అలాగే స్విస్ ప్రజలు కూడా రుద్రాక్షలను కొనుగోలు చేస్తున్నందున ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.


స్విట్జర్లాండ్‌లో రుద్రాక్ష లకు పెరుగుతున్న డిమాండ్.. భారతీయ ఎగుమతిదారులకు ఇప్పుడు మంచి మార్కెట్‌‌గా మారనుందనేది స్పష్టమైంది. మన దేశంలోని హరిద్వార్, ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని రుద్రాక్ష బిజినెస్ చేసేవారు తరతరాలుగా ఈ వ్యాపారాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే హిమాలయ రుద్రాక్ష పరిశోధన కేంద్రం వంటి కంపెనీలు ఎలాంటి కల్తీ లేని ఒరిజినల్ రుద్రాక్ష విత్తనాలను సరఫరా చేస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే ఈ రుద్రాక్షల నుంచి తయారైన ఆభరణాలను ఎగుమతి చేస్తున్నాయి. ఇక మేలైన రుద్రాక్షలను కొనుగోలు చేసేందుకు.. స్విస్ వాసులు మరింత ఎక్కువ డబ్బును చెల్లించేందుకు సిద్ధంగా ఉంటున్నారని బిజినెస్‌మెన్ చెబుతున్నారు. అందుకే ఈ రుద్రాక్ష బిజినెస్ మార్కెట్ భారత్‌కు లాభాలను తెచ్చిపెట్టడమే కాకుండా దీర్ఘకాలికంగా ఆదాయ వనరుగా మారుతుందని పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa