గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతికి ప్రతిపాదించిన 20 పాయింట్ల ప్రణాళికపై హమాస్ మూడు నాలుగు రోజుల్లోనే స్పందన తెలియజేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ప్రణాళికకు అందరూ ఒకే చెప్పారని, హమాస్ స్పందన కోసం తాము ఎదురుచూస్తున్నామని అన్నారు. ఒకవేళ హమాస్ దీనికి ఒప్పుకోకుంటే విషాదకర ముగింపు తప్పదని ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, 72 గంటల్లో బందీలు విడుదల, హమాస్ ఆయుధాలను వీడటం, దశలవారీగా గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలగడం వంటివి అమెరికా ప్రతిపాదించిన ప్రణాళికలో ఉన్నాయి. స్వయంగా ట్రంప్ నేతృత్వంలోని యుద్ధానంతర పరివర్తన అధికారాన్ని కూడా ఇది ప్రతిపాదిస్తుంది.
పీస్ ప్లాన్పై వైట్హౌస్ వద్ద మీడియా అడిగిన ప్రశ్నలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమాధానం ఇస్తూ... హమాస్కు మూడు నాలుగు రోజులే సమయం ఉందన్నారు. హమాస్ స్పందన కోసం మేము ఎదురుచూస్తున్నామని, మిగతా అందరూ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారని వివరించారు. ‘‘అరబ్ దేశాలు అన్నీ సంతకాలు చేశాయి.. ముస్లిం దేశాలు కూడా ఆమోదించాయి.. ఇజ్రాయెల్కు కూడా సమ్మతి తెలిపింది... మేము హమాస్ స్పందన కోసం వేచిచూస్తున్నాం... వాళ్లు శాంతి ప్రణాళికకు ఒప్పుకుంటారో లేదో చూడాలి.. కానీ, అంగీకరించకుంటే విచారకరమైన ముగింపు తప్పుదు’’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా, గాజా శాంతికి అమెరికా 20 సూత్రాల ప్రణాళికపై హమాస్ పాలస్తీనా పాటు విదేశాల్లోని రాజకీయ, సైనిక నాయకత్వాలతో పలు దఫాలుగా సంప్రదింపులు చేస్తున్నట్టు పాలస్తీనా వర్గాలు తెలిపారు. ప్రణాళికలో సంక్లిష్టమైన అంశాలు ఉండటంతో చర్చలకు కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
శాంతి ప్రణాళిక ప్రకటనను ‘ అద్భుతమైన రోజుగా అభివర్ణించిన ట్రంప్.. నాగరికత చరిత్రలోనే గొప్ప రోజులలో ఒకటి కావచ్చు’ అని ట్రంప్ వివరించారు. ట్రంప్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నేతన్యాహు ‘‘గాజా యుద్ధాన్ని ముగించే మీ ప్రణాళికకు నేను మద్దతు ఇస్తున్నాను, ఇది మా యుద్ధ లక్ష్యాలను సాధిస్తుంది’ అని చెప్పారు. అయితే, ‘హమాస్ మీ ప్రణాళికను తిరస్కరించినా,లేదా వారు అంగీకరించినట్లు నటించి వాస్తవానికి దానిని వ్యతిరేకించే చర్యలకు దిగినా, ఇజ్రాయెల్ స్వయంగా ఆ పనిని పూర్తి చేస్తుంది’ అని అన్నారు. అక్టోబరు 7, 2023 ఇజ్రాయెల్లోకి హమాస్ సాయుధులు చొరబడి.. దాదాపు 12 మందిని ఊచకోత కోశారు. దీంతో గాజాలోని హమాస్పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్.. అప్పటి నుంచి భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ 66 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa