బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల పంటలకు మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు వంటివి ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించగా.. ఇందులో ఎనిమిది తెలుగు రాష్ట్రాల్లోనే (ఆంధ్రప్రదేశ్కు నాలుగు, తెలంగాణకు నాలుగు) ఏర్పాటుచేస్తారు. ఏపీకి కేంద్రీయ విద్యాలయాలను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లకు ఏపీ సీఎం ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రం నిర్ణయం రాష్ట్రంలోని విద్యా వ్యవస్ధ అభివృద్దికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. అంతేకాదు, గతgలో జరిగిన తప్పిదాలు కూడా సరిచేయడానికి అవకాశం లభిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘ఈ కార్యక్రమం మా రాష్ట్రంలో ఇంతకు ముందు విస్మరించిన ప్రాంతాలలో నాణ్యమైన విద్యా అవకాశాలను గణనీయంగా పెంచడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల పెరుగుతున్న అవసరాలను కూడా తీర్చుతుంది’ అని ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేసి, మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను ట్యాగ్ చేశారు.
రాజధాని అమరావతి, శ్రీకాకుళం జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు కలిపి మొత్తం నాలుగుచోట్లు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుచేయనున్నారు. చిత్తూరు జిల్లాలో మంగ సముద్రం, బైరుగానిపల్లె (కుప్పం మండలం), శ్రీకాకుళం జిల్లాలోని పలాస, అమరావతిలోని శాఖమూరులో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సైతం నాలుగు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, తెలంగాణ విషయానికి వస్తే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్త కేంద్రీయ విద్యాలయాల కోసం మొత్తం రూ.5862 కోట్లను కేంద్రం కేటాయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa