సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన కంటెంట్, పోస్ట్ల నియంత్రణ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసభ్య పోస్ట్ల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి మంత్రివర్గ ఉప-సంఘాన్ని నియమిస్తూ బుధవారం (అక్టోబరు 1న) ఉత్తర్వులు వెలువరించింది. మొత్తం ఐదుగురు మంత్రులతో ఈ కమిటీ వేసింది. ఇందులో హోం మంత్రి వంగలపూడి అనిత, ఐటీ అండ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హౌసింగ్ అండ్ సమాచార ప్రసార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిలను సభ్యులుగా నియమించింది.
మొత్తం ఏడు అంశాలపై అధ్యయనం చేపట్టి నివేదికను అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సోషల్ మీడియా చట్టాలు, నియమాలు, గైడ్లైన్స్ను సమీక్షించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు, కంటెంట్లో జవాబుదారీతనం, బాధ్యతలు, నియంత్రణ చర్యలు, అంతర్జాతీయ విధానాలు, పారదర్శక ప్రమాణాలు, యూజర్ల రక్షణ, ప్రమాదకర కంటెంట్, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం, పోస్టులపై ఫిర్యాదులు, పరిష్కారాలను అధ్యయనం చేయాలని క్యాబినెట్ సబ్-కమిటీకి ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, పౌరహక్కుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ సలహాలను ఇవ్వనుంది.
ఇక, రాష్ట్రంలో సోషల్ మీడియా రాజకీయం ట్రెండ్ నడుస్తోంది. నకిలీ పోస్ట్లు, అనుచిత వ్యాఖ్యలు.. డీప్ఫేక్, మార్ఫింగ్, ఎడిటింగ్ ఫోటోలు, వీడియోలు రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారిపోతున్నాయి. ఇదే సమయంలో ఎవరుపడితే వారిపై ఇష్టారీతిన అసభ్యకర, అవమానకర పోస్ట్లు చేస్తుండటం పెను సమస్యగా మారింది. అధికార, ప్రతిపక్షమనే కాదు అన్ని పార్టీలకు చెందిన నేతలపై సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్లు వెల్లువలా వస్తున్నాయి. వీటిలొ కొన్ని సొంత పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి పెడుతుంటే, మరికొందరు మాత్రం ఫేక్ పేర్లు, ఫోటోలతో అడ్డగోలుగా పోస్ట్లు పెడుతున్నారు. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత రాజకీయం మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. రోజు రోజుకూ పెరిగిపోతున్న విపరీత పోకడలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేసులు, జడ్జిలు, కోర్టు తీర్పులపై కూడా వక్రభాష్యానికి కేరాఫ్ అడ్రస్లుగా సోషల్ మీడియా మారిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa