తిరుమల శ్రీవారి చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ చరిత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే మొదటిసారి అన్నారు. 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని.. భక్తులు టీటీడీ సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అందించిన సేవలు, హుండీ ఆదాయం వివరాలు వెల్లడించారు.
తిరుమల శ్రీవారికి కానుకల ద్వారా రూ. 25.12 కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని తెలిపారు. అలాగే 28 లక్షలకు పైగా లడ్డూలు విక్రయించారు.. 26 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామన్నారు. 2.42 లక్షల మంది తలనీలాలు సమర్పించారని.. ఆర్టీసీ బస్సులలో 4.40 లక్షల మంది తిరుపతి నుంచి తిరుమలకు, 5.22 లక్షల మంది తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించారన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు మునుపెన్నడూ లేనంతగా విశిష్టంగా జరిగాయన్నారు. 25 రాష్ట్రాల నుంచి కళా బృందాలు వచ్చాయని.. గరుడసేవ రోజున 780 మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించారన్నారు.
అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 60 టన్నుల పుష్పాలు ఉపయోగించామని.. మునుపెన్నడూ లేనంతగా విద్యుత్ దీపాలు అలంకరణ చేశామన్నారు. బ్రహ్మోత్సవాలను భక్తులు తిలకించేందుకు 36 ఎల్ ఈ డీ స్క్రీన్లు ఏర్పాటు చేశామని.. ఎస్వీబీసీ ఛానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు బ్రహ్మోత్సవాలు తిలికించారన్నారు. శ్రీవారి సేవకులు ఈ ఏడాది గణనీయంగా వచ్చారని.. 3,500 మంది శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారన్నారు.
అంతకముందు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల చివరి రోజు గురువారం శ్రీవారి చక్రస్నానం శాస్త్రబద్ధంగా జరిగింది. లోకం క్షేమం, భక్తుల సుఖశాంతుల కోసం ఈ వేడుకను నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు ఈ కార్యక్రమం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఆ తర్వాత శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం అద్భుతంగా నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల్లో చేసిన అన్ని సేవలు విజయవంతం కావాలని, లోకం అంతా బాగుండాలని, భక్తులు సంతోషంగా ఉండాలని చక్రస్నానం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa