ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పీఏ అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 03:52 PM

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ నేత అంజాద్ బాషా పీఏను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. కడప టీడీపీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫైర్ బ్రాండ్‌గా పేరొందారు. మొన్నటి ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు మాధవిరెడ్డి. అయితే దూకుడైన తీరుతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటారు. కడప మాజీ మేయర్‌తో వివాదాలు వంటి అంశాలతో ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే మాధవి రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ మాధవిరెడ్డి భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఇటీవల కడప వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం మీద కేసు నమోదు చేసిన కడప వన్ టౌన్ పోలీసులు.. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాను అరెస్ట్ చేసినట్లు సమాచారం.


మరోవైపు సెప్టెంబర్ 25వ తేదీ ఈ విషయం మీద శ్రీనివాసులు రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర పోస్టులు ద్వారా పరువు నష్టం కల్గిస్తున్నారని ఆరోపించారు. కొన్ని ఆధారాలు కూడా సమర్పించినట్లు సమాచారం. దీంతో క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా సోషల్ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్‌లో కొన్ని పేజీలను గుర్తించారు. మొత్తం 15 వరకూ ఫేస్ బుక్ పేజీలను తొలగించారు. ఈ క్రమంలోనే అంజాద్ బాషా పీఏ ఖాజాను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం అతన్ని కడపకు తరలించినట్లు సమాచారం.జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో మిగిలిన వారి ప్రమేయం పైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం.


మరోవైపు అంజాద్ బాషా.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు అంజాద్ బాషా. అనంతరం జగన్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అంజాద్ బాషా రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. 2004లో కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలుపొందారు. అనంతర కాలంలో వైసీపీలో చేరిన అంజాద్ బాషా.. 2014, 2019 ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసి గెలిపొందారు.2019లో ఉపముఖ్యమంత్రిగానూ బాధ్యతలు స్వీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa