భారత్కు అసలైన స్నేహితులు ఎవరో, ఎంతవరకు తమ పక్కన నిలబడగలరో పహల్గామ్ ఉగ్రదాడితో తేలిపోయిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గురువారం అన్నారు. అందుకే జాతీయ భద్రత విషయంలో భారత్ మరింత జాగ్రత్తగా.. బలంగా ఉండాలని అన్నారు. ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నామని, మున్ముందు కూడా అలాగే చేస్తామని.. కానీ జాతీయ భద్రత విషయానికి వస్తే భారత్ మరింత జాగ్రత్త వహించాలని చెప్పారు. ఆర్ఎస్ఎస్ విజయదశమి ర్యాలీ సందర్భంగా మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మోహన్ భగవత్ చెప్పింది ఆ దేశాల గురించేనా?
చైనా, టర్కీ, అజర్బైజాన్ను ఉద్దేశించే మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేశారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత అంతర్జాతీయ వేదికపై.. పాకిస్థాన్కు పలు సందర్భాల్లో మద్దతు ఇచ్చాయి మూడు దేశాలు. ఐక్యరాజ్యసమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) వంటి వేదికలో కూడా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడాయి.
ప్రసంగంలో ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు మోహన్ భగవత్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు సరిహద్దు దాటి 26 మంది భారతీయులను అతి కిరాతకంగా కాల్చి చంపారని.. ఇది దేశ ప్రజల్లో అపారమైన బాధ, కోపాన్ని రగిలించిందని చెప్పారు. అయితే భారత్ పక్కా ప్రణాళికతో ప్రతీకారం తీర్చుకుందన్నారు. భారత నాయకత్వ సంకల్పం, సాయుధ దళాల శౌర్యం, సమాజ ఐక్యత ఆపరేషన్ సిందూర్ వేళ స్పష్టంగా కనిపించాయన్నారు. ఉగ్రదాడికి దేశం నుంచి సరైన స్పందన వచ్చిందని భగవత్ పేర్కొన్నారు.
నేపాల్ గొడవలు భారత్కు మంచి సంకేతం కాదు..
నేపాల్లో ఇటీవల జరిగిన హింసాత్మక సంఘటనల గురించి కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రస్తావించారు. అక్కడ దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమం.. పాలనలో మార్పుకు దారితీసిందన్నారు. అయితే పొరుగు దేంలో జెన్జీ నిరసనల పేరుతో జరిగిన అశాంతి భారత్కు మంచి సంకేతం కాదని చెప్పారు.
'శ్రీలంక, బంగ్లాదేశ్, ఇటీవల నేపాల్లలో ప్రజల ఆగ్రహం.. హింసాత్మకంగా మారింది. దీనివల్ల ప్రభుత్వాలు కూలిపోయాయి. ఇది భారత్కు ఆందోళన కలిగించే విషయం. భారత్లో ఇటువంటి అల్లకల్లోలాలను సృష్టించాలనుకునే శక్తులు.. దేశం లోపల, వెలుపల చురుకుగా పనిచేస్తున్నాయి. హింసాత్మక తిరుగుబాటు వల్ల ఏం ఒరగదు. అవి అరాచకానికి మాత్రమే దారితీస్తాయి. అలా ఏ దేశంలోనైనా అశాంతి నెలకొంటే.. విదేశీ శక్తులు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది' అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వివరించారు. కాగా, ఆర్ఎస్ఎస్ను స్థాపించి వందేళ్లు పూర్తైంది. 1925లో మహారాష్ట్రలోని నాగ్పుర్కు చెందిన ఫిజిషియన్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ దసరా పర్వదినాన రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ను స్థాపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa