ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరూర్ తొక్కిసలాటపై సిట్ విచారణ..విజయ్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

national |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 07:52 PM

తమిళనాడులోని కరూర్‌లో ఇటీవల తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాటలో మహిళలు, చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. అయితే సీబీఐ దర్యాప్తు కోరుతూ టీవీకే విజయ్ చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు టీవీకే నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.


ప్రస్తుత నార్త్ జోన్ ఐజీ అస్రాగర్గ్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తుకు మద్రాసు హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాట కేసులో (తమిళగ వెట్రి కళగం) టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ పేరును.. ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదని అడుగుతూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తొక్కిసలాట ఘటన తర్వాత టీవీకే నాయకులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. ప్రమాదం గురించి పట్టించుకోకుండా పార్టీ నాయకులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పడం.. వారి మనస్తత్వాన్ని సూచిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక తొక్కిసలాటలో 41 మృతి చెందినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం విజయ్‌పై ఉదాసీనత చూపిస్తోందని మండిపడింది.


కరూర్‌లో ఏమి జరిగిందో ప్రపంచం మొత్తం చూసిందని హైకోర్టు పేర్కొంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నందున.. తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వారిపై లేదా అని.. నిర్వాహకులను, పోలీసులను.. బెంచ్ ప్రశ్నించింది. ఇంత జరిగినా తర్వాత కూడా కళ్ళు మూసుకోలేమని బలమైన ఘాటుగా స్పందించింది. ఇక టీవీకే నాయకులు బుస్సీ ఆనంద్, సీటీఆర్ నిర్మల్ కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఉత్తర్వులు రిజర్వ్‌లో ఉంచింది ధర్మాసనం. కాగా, తొక్కిసలాట నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పర్యటనలను విజయ్ రద్దు చేసుకున్నారు.


సీబీఐ దర్యాప్తు పిటిషన్ కొట్టి వేత..


కరూర్ తొక్కిసలాట కేసుపై శుక్రవారం (అక్టోబర్ 3) ఉదయం కూడా మద్రాసు హైకోర్టు విచారణ జరిపింది. విజయ్ పక్షం తరఫున సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా విజయ్ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. కరూర్ ఘటనపై పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని తెలిపింది. ఈ సందర్భంలో సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదని.. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చరాదని హితవు పలికింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ న్యాయవాది జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టేసింది మద్రాసు హైకోర్టు. అది తమ పరిధిలోనికి రాదని మధురై బెంచ్‌ను ఆశ్రయించాలని సూచించింది. అయితే తొక్కిసలాటకు డీఎంకేనే కారణమని.. సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీవీకే నేతలు ఇటీవల డిమాండ్ చేశారు.


కోర్టు కీలక సూచనలు..


రాజకీయ పార్టీలకు కోర్టు కీలక సూచనలు చేసింది. భవిష్యత్తులో జరిగే ప్రజా, రాజకీయ సమావేశాలలో తాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు, అంబులెన్స్ సేవలు, ఎంట్రీ- ఎగ్జిట్ మార్గాలు మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa