కృష్ణా జిల్లా అవనిగడ్డ 8వ వార్డులో ఒకే రోజు ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ మరణాలకు కారణం అతిసార (డయేరియా) వ్యాధి అని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగునీటి కలుషితం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు వాదిస్తున్నారు.స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో 8వ వార్డుకు చెందిన కేతేపల్లి కోటయ్య (66) శుక్రవారం ఉదయం మృతి చెందగా, అదే వార్డుకు చెందిన మునిపల్లి సరోజిని (85) మధ్యాహ్నం మరణించారు. ఆమె ఈ నెల 1 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత నెల 29న అతిసార లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన బందెల జ్ఞాన సుందర్ రావు (60) కూడా శుక్రవారం మృతి చెందారు. లంకమ్మ మాన్యం బోరు నీటిని క్లోరినేషన్ చేయకుండా నేరుగా సరఫరా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నెల 22 నుంచి వార్డులో అతిసారం వ్యాప్తి చెందిందని, కుళాయిల నీరు కలుషితమైందని, తాగడానికి పనికిరాదని నివేదికలు వచ్చినా, ఆ విషయాన్ని బయటకు రాకుండా అదే నీటిని సరఫరా చేస్తున్నారని ఆ వార్డు ప్రజలు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే అతిసార వ్యాధి ప్రబలిందని వారు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa