తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు కొత్త విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. రాజమహేంద్రవరం-తిరుపతి విమాన సర్వీస్ అక్టోబర్ 1న ప్రారంభమైంది. ఈ విమాన సర్వీస్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రయాణికులకు ఈ దసరా పండుగ మరింత సంతోషాన్ని తెచ్చింది. అలయన్స్ ఎయిర్ లైన్స్ తిరుపతికి కొత్త విమాన సర్వీసు ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి సులభంగా, తక్కువ సమయంలో వెళుతున్నారు. గతంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబయి నగరాలకు మాత్రమే విమాన సేవలు ఉండేవి. ఇప్పుడు తిరుపతి కూడా ఈ జాబితాలో చేరింది. దీంతో ప్రయాణికులు ఎంతో ఆనందంలో ఉన్నారు.
సాధారణంగా ఉభయ గోదావరి జిల్లాల నుండి తిరుపతికి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఎనిమిది నుండి పది గంటల సమయం పడుతుంది. కానీ, విమానంలో కేవలం గంటన్నరలోనే తిరుపతి చేరుకోవచ్చు. దీంతో ప్రయాణ సమయం చాలా తగ్గిస్తుంది. ఈ కొత్త విమాన సర్వీసు వారంలో మూడు రోజులు (మంగళ, గురు, శనివారాల్లో) అందుబాటులో ఉంటుంది. తిరుపతి నుంచి ఈ విమానం ఉదయం 7:40 గంటలకు బయలుదేరి.. 9:25 గంటలకు రాజమహేంద్రవరం వస్తుంది. రాజమహేంద్రవరం నుంచి ఉదయం 9:50 గంటలకు బయలుదేరి.. 11:20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ఈ కొత్త విమాన సర్వీసులో తక్కువ ధరకే టికెట్లు, తక్కువ ప్రయాణ సమయం కావడంతో రెండు రోజుల్లోనే మంచి స్పందన వచ్చింది. మొదటి రోజు రాజమహేంద్రవరం నుంచి 66 మంది తిరుపతికి వెళ్లారు. రెండో రోజు 67 మంది ప్రయాణించారు. తిరుపతి నుంచి మొదటి రోజు 38 మంది వచ్చారు.. రెండో రోజు 40 మంది ప్రయాణికులు రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఈ విమానంలో మొత్తం 70 సీట్లు ఉన్నాయి.. వాటిలో సగం టికెట్లు రూ.1,999లకు అమ్ముతున్నారు. మిగిలిన టికెట్లు రూ.4 వేలుగా ఉన్నాయి. రైలు లేదా బస్సులో తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలంటే 8 నుంచి పది గంటల సమయం పడుతుంది. ప్రయాణంతో చాలా సమయం వృథా అయ్యేది.. అయితే ఇప్పుడు చాలా త్వరగా వెళ్లిపోవచ్చు అంటున్నారు. ప్రయాణ సమయం తగ్గుతుందంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa