ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జుబీన్ గార్గ్ మృతి కేసు.. మేనేజరే విషమిచ్చాడంటూ ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం

national |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 08:50 PM

ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు బలవంతంగా ఆయన్ను ఈతకు తీసుకళ్లి చంపారని ఆయన భార్య ఆరోపణలు చేయగా.. తాజాగా జుబీన్ గార్జ్ మేనేజర్ సిద్ధార్థ శర్మనే.. ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసి అతడిని చంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్రను కప్పిపుచ్చడానికి సిద్ధార్థ శర్మ 'విదేశీ మద్యాన్ని' ఏర్పాటు చేశాడని కూడా విచారణ నివేదికలు సూచిస్తున్నాయి. సింగపూర్‌లో సముద్రంలో ఈత కొడుతూ.. సెప్టెంబర్ 19న జుబీన్ గార్గ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అస్సాం ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ తయారు చేసిన రిమాండ్ నోట్‌లో.. సిద్ధార్థ శర్మపై షాకింగ్ వివరాలను వెల్లడించింది. పోలీస్ ఎఫ్‌ఐఆర్‌లో శర్మపై నేరపూరిత కుట్ర, హత్య, హత్యానేరం వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదు చేశారు.


ప్రత్యక్ష సాక్షి సంచలన వాంగ్మూలం..


ఈ కేసులో ముఖ్య సాక్షిగా గుర్తించిన శేఖర్ జ్యోతి గోస్వామి ఇచ్చిన వాంగ్మూలం రిమాండ్ కాపీలో నమోదైంది. గార్గ్ మరణానికి ముందు.. శర్మ బలవంతంగా జుబీన్ గార్గ్ నుంచి పడవ నియంత్రణను తీసుకున్నాడని.. ఆ మరణాన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించడానికి కుట్ర పన్నాడని గోస్వామి తెలిపారు. సిద్ధార్థ శర్మ, అతని సహచరుడు శ్యామకాను మహంత ఉద్దేశపూర్వకంగానే జుబీన్‌కు విషమిచ్చి, ఆ కుట్రను దాచడానికి విదేశీ మద్యాన్ని ఏర్పాటు చేశారని గోస్వామి ఆరోపించారు.


గార్గ్ తన చివరి క్షణాల్లో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో.. శర్మ అతని పరిస్థితిని 'యాసిడ్ రిఫ్లక్స్'గా కొట్టిపారేస్తూ.. జాబో దే, జాబో దే(అతన్ని వెళ్లనివ్వండి, వెళ్లనివ్వండి) అని అరిచాడని సాక్షులు వెల్లడించారు. శర్మ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని.. పడవను ప్రమాదకరంగా నడిపి అందరినీ ప్రమాదంలోకి నెట్టాడని గోస్వామి తెలిపారు. అయితే జుబీన్ గార్గ్ ఒక నిపుణుడు, శిక్షణ పొందిన ఈతగాడని గుర్తు చేశారు. కాబట్టి అతను ఈత కారణంగా మరణించే అవకాశం లేదని సాక్షి స్పష్టం చేశారు. ఈ కుట్రను దాచి పెట్టడానికి ఉద్దేశపూర్వకంగానే మేనేజర్ సింగపూర్‌ను ఎంచుకున్నారని.. అలాగే పడవ వీడియోలను ఎవరికీ షేర్ చేయవద్దని శర్మ తనకు సూచించాడని గోస్వామి పోలీసులకు తెలిపారు.


జూబిన్ గార్గ్ నోటి, ముక్కు నుంచి నురుగు వస్తున్నప్పుడు.. నిందితుడు సిద్ధార్థ శర్మ దానిని 'యాసిడ్ రిఫ్లక్స్' అని కొట్టిపారేసి ఎలాంటి వైద్య సదుపాయాలు అందించకుండా జుబీన్ గార్గ్ త్వరగా చనిపోవడానికి కారణమయ్యాడని రిమాండ్ నోట్ పేర్కొంది. మరోవైపు ఈ సంచలనాత్మక మరణంపై లోతైన దర్యాప్తు నిర్వహించడానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ కీలక ప్రకటన చేశారు. జుబీన్ మృతి కేసును విచారించడానికి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని శుక్రవారం ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రకటించారు. గౌహతి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్ర సైకియా ఈ కమిషన్‌కు నేతృత్వం వహిస్తారని వల్లడించారు.


మరోవైపు జుబీన్ గార్గ్ మరణానికి సంబంధించిన ఎటువంటి సమాచారం లేదా వీడియోలు ఉన్నా.. ప్రజలు ముందుకు వచ్చి కమిషన్ ముందు సాక్ష్యం చెప్పాలని ముఖ్యమంత్రి కోరారు. జుబీన్ గార్గ్ నాల్గవ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో పాల్గొనడానికి సింగపూర్‌కు వెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన తర్వాత.. ప్రస్తుతం సీఐడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. పత్రాలు, ఆర్థిక లావాదేవీలు, సాక్షి వాంగ్మూలాల ద్వారా శర్మ నేరాన్ని ప్రాథమికంగా రుజువు చేస్తున్నాయని రిమాండ్ నోట్ నొక్కి చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa