అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థుల కలలు కరిగిపోతున్నాయి. వరసుగా ఆయన షాక్ల మీద షాక్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇటీవలే H-1B వీసా అప్లికేషన్ ఫీజును ఏకంగా 100,000 డాలర్లకు పెంచుతూ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం ఒక పెద్ద షాక్. ఈ షాక్ నుంచి తేరుకోకముందే, ఇప్పుడు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ను పూర్తిగా ఎత్తేయడానికి అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్లో ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఇదే కనుక నిజమైతే, అమెరికా కలల కోసం వెళ్లే వేలాది మంది భారతీయులకు ఇది నిజంగా శరాఘాతమే! రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే.
విదేశీ విద్యార్థులు అమెరికాలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, తమ కోర్సుకు సంబంధించిన రంగంలోని కంపెనీల్లో ప్రాక్టికల్ అనుభవం కోసం తాత్కాలికంగా పనిచేయడానికి ఇచ్చే పర్మిషన్ ఓపీటీ. సాధారణంగా ఇది ఒక ఏడాది ఉంటుంది. కానీ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సులు చదివిన మన విద్యార్థులకు ఏకంగా 36 నెలల వరకు పొడిగింపు దొరుకుతుంది. ఈ OPT పీరియడ్లోనే చాలామంది అక్కడి కంపెనీల్లో అనుభవం సంపాదించుకుని, ఆ తర్వాత H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఇప్పుడు ఆ అవకాశం రద్దయితే, డిగ్రీ పూర్తయిన వెంటనే జాబ్ రాకపోతే... వెంటనే ఇండియాకి తిరిగి వచ్చేయాల్సిందే.
ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అవకాశాలకు ఎలా గండికొడుతుందో ఈ లెక్కలు చూస్తే తెలుస్తుంది. 2024లో OPT వర్క్ పర్మిట్ పొందిన విదేశీ విద్యార్థుల్లో దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు. అందులో కొత్తగా STEM-OPT అనుమతులు పొందినవారు దాదాపు లక్ష మందికి వరకు ఉంటారని అంచనా. ఇక, అమెరికాలో OPT చేస్తున్న మొత్తం విద్యార్థుల్లో మన భారతీయుల సంఖ్య 2006-07లో 22.12% ఉంటే, 2023-24 నాటికి ఏకంగా 40.18%కి పెరిగింది. దీన్ని బట్టి, ఉద్యోగాలకు సిద్ధమయ్యేందుకు OPT మనవారికి ఎంత కీలకమో అర్థమవుతుంది.
నిజం చెప్పాలంటే, అమెరికాలో STEM రంగాల అభివృద్ధికి మన భారతీయులే వెన్నెముక. 2019 నాటికి అమెరికాలోని STEM ఉద్యోగుల్లో అత్యధికంగా 28.9 శాతం మంది భారతీయులే ఉన్నారు. మొత్తంగా అక్కడ STEM వర్క్ఫోర్స్లో విదేశీయుల శాతం రెండు దశాబ్దాల్లో బాగా పెరిగింది. అమెరికన్ల అవసరాలకు తగ్గట్టుగా అక్కడ నిపుణులు లేరు. అందుకే, విదేశాల నుంచి, ముఖ్యంగా మన దేశం నుంచి వెళ్లిన STEM నిపుణులు అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. H-1B వీసా పొందినవారిలో 70 శాతం మంది భారతీయులే.
ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా భారతీయులే ఉన్నారు. వీరిలో దాదాపు ప్రతి నలుగురిలో ముగ్గురు (75%కి పైగా) STEM కోర్సులు చదువుతున్నవారే కావడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో OPT ప్రోగ్రామ్ను రద్దు చేస్తే, చదువు పూర్తి కాగానే ఉద్యోగం రాకపోతే వీరంతా వెనక్కి తిరిగి రావాల్సిందే. ఈ నిర్ణయం వల్ల అమెరికన్ యూనివర్సిటీలు కూడా అంతర్జాతీయ విద్యార్థులను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ బిల్లు పాస్ అయితే, అమెరికాలో చదివి, అక్కడే ఉద్యోగం చేయాలనే మన యువత ఆశలపై నీళ్లు చల్లినట్లే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa